ఏపీ, తెలంగాణా మధ్య నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై ఆర్టీయే కొరడా: హైదరాబాద్ శివారులో దాడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్న ప్రైవేటు బస్సులపై కొరడా ఝుళిపించడానికి రంగంలోకి దిగింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీయే అధికార గణం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీయే అధికారులు దృష్టిసారించారు. ఒకపక్క సంక్రాంతి సీజన్ కావడంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారు ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు. ఇక వారికి చెక్ పెట్టడం కోసం రంగంలోకి దిగింది ఆర్టిఏ.
Recommended Video
హైదరాబాద్ సరిహద్దుల్లో ప్రైవేట్ బస్సులపై ఆర్టీయే కొరడా
నిబంధనలకు విరుద్ధంగా, సరైన పర్మిట్లు లేకుండా, ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తూ ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ఈరోజు ఉదయం హైదరాబాద్ శివార్లలో పలుచోట్ల తనిఖీలను చేపట్టారు ఆర్టీయే అధికారులు. బెంగళూరు, తిరుపతి, కడప నుంచి వచ్చే బస్సులను శంషాబాద్ వద్ద ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఒంగోలు, నెల్లూరు ,విజయవాడ, విశాఖపట్నం వైపు నుంచి వచ్చే బస్సులను అవుటర్ రింగ్ రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్నారు.
కొనసాగుతున్న సోదాలు ..ఐదు బస్సులపై కేసులు నమోదు
ప్రస్తుతం ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంతవరకూ అధికారులు ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న ప్రైవేటు బస్సులపై కొరడా ఝళిపిస్తూ ఆర్టీఏ అధికారులు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పల్లి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై బెంగళూరు నుండి వస్తున్న ప్రతి బస్సును ఆపి డాక్యుమెంట్లను చెక్ చేస్తున్నారు. మొన్నటి వరకు కరోనా దెబ్బకు కుదేలయిన ప్రైవేటు బస్సుల నిర్వాహకులు, ఇప్పుడు సంక్రాంతికి అయినా కొంత కోలుకుంటామని భావిస్తే ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తూ కేసులు పెట్టడం ప్రైవేటు బస్సుల నిర్వాహకులకు అశనిపాతంగా మారింది.
మొన్నటిదాకా కరోనా దెబ్బ ... ఇప్పుడు పండుగ టైం లో ఆర్టీయే దెబ్బ
కరోనా కారణంగా గతంతో పోలిస్తే ఈ సారి ప్రైవేట్ ట్రావెల్స్ కు సంక్రాంతి పండుగకు పెద్దగా గిరాకీ లేదనే చెప్పాలి . ప్రైవేట్ ట్రావెల్స్ ఈ సారి ఇతర ప్రాంతాలకు నడిపిన బస్సు సర్వీసులు కూడా పెద్దగా లేవనే చెప్పాలి . కరోనా దెబ్బ ట్రావెల్స్ మీద దారుణంగా పడింది. ప్రభుత్వం కాస్తో కూస్తో చేయూత అందిస్తే బాగుంటుంది అన్న భావనలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఉంటే దొరికిందే ఛాన్స్ అంటూ అధికారులు తనిఖీలు చేస్తూ కేసులు బుక్ చేస్తున్నారు .