గచ్చిబౌలిలో ఆర్టీసీ బస్సు బీభత్సం: ముగ్గురు మృతి, అతివేగమే కారణం
హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న పాదచారులపైకి బస్సు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. హెచ్సీఐ డిపోకు చెందిన బస్సు లింగంపల్లి నుంచి కోఠి వెళ్తోంది.
సోమవారం ఉదయం 8 గంటల సమయంలో గచ్చిబౌలి చౌరస్తా వద్దకు చేరుకున్న బస్సు మరో బస్సును తప్పించబోయి రోడ్డు దాటుతున్న పాదచారుల పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
మృతుల్లో దశరథ్ అనే ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. మిగిలిన ఇద్దరి గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.