తొలగింపు నిర్ణయం.. ఆగిన మరో ఆర్టీసీ కార్మికుని గుండె .. విషాదంలో ఆర్టీసీ కార్మికులు
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు గా సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక ఈ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని తెలంగాణ సర్కార్ పట్టుదలగా ఉండటంతో ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులలో ఆందోళన ప్రాణాల మీదకు తెస్తోంది.
ఈరోజు తెల్లవారుజామున ఆర్టీసీ లో పనిచేసే తన భార్య ఉద్యోగం పోయిందని ఆవేదనతో సంగారెడ్డి పరిధిలోని బాబా నగర్ లో నివాసం ఉండే కిషోర్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. ఉద్యోగం లేకుంటే కుటుంబ పోషణ భారంగా మారుతుందని భావించిన నేపథ్యంలోనే, భార్య ఉద్యోగం పోయిందని భావించిన భర్త మనస్థాపానికి గురయ్యారు. గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఇక తాజాగా మరో ఆర్టీసీ కార్మికుడు కొలువు పోయిందన్న బెంగతో మృత్యువాత పడ్డాడు.
ఒకపక్క ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉద్యోగాల విషయంలో న్యాయ పోరాటం చేసి, తిరిగి తమ ఉద్యోగాలు సాధించుకుందామని చెప్పినప్పటికీ సగటు ఆర్టీసీ కార్మికుల ఆందోళన మాత్రం తగ్గటం లేదు. నెల జీతం మీద గుట్టుగా సంసారం నెట్టుకొస్తున్న ఆర్టీసీ కార్మికులు, ఇకనుండి ఆ కొలువు కూడా లేదు అని తెలియడంతో ఆవేదనకు గురవుతున్నారు. ఇక ఆర్టీసీలో కొలువు పోయిందని హెచ్.సి.యు డిపో డ్రైవర్ షేక్ ఖలీల్ మియా అనే వ్యక్తి హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఖలీల్ మియా వయస్సు 48 సంవత్సరాలు.
రామచంద్రపురం ఈఎస్ఐ వద్ద నివాసముంటున్న ఖలీల్ మియా కుటుంబం ఆయన మృతితో కన్నీరు మున్నీరు అవుతోంది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చోటు చేసుకుంటున్న ఈ మరణాలు ప్రభుత్వ హత్యలే అని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని మార్చుకుని ఆర్టీసీ కార్మికుల పట్ల ఉదారతతో వ్యవహరించాలని కార్మిక సంఘాల జెఎసి డిమాండ్ చేస్తోంది.