ఆర్టీసీకి రైట్ చెప్పిన సీఎం కేసీఆర్... కార్మికులు విధుల్లో చేరాలని ఉత్తర్వులు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని చెప్పారు. అందుకు సంబంధించి ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. ఆర్టీసీకి వెంటనే 100 కోట్ల రూపాలయ తక్షణ సహాయాన్ని అందిస్తామని చెప్పారు. ఇక కార్మికులకు ఎలాంటీ షరతులు కూడ విధించమని చెప్పారు. మరోవైపు సమ్మెలో భాగంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వంలో లేదా ఆర్టీసీలో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు.
క్యాబినెట్ వివరాలు వెల్లడించిన సీఎం
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన చేపట్టిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. క్యాబినెట్లో తీసుకున్న వివరాలను స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 50 రోజులకు పైగా కొనసాగిన ఆర్టీసీ సమ్మెకు ఈ సంధర్భంగా ఫుల్స్టాప్ పెట్టారు. కార్మికులు రేపే ఉద్యోగాల్లో చేరాలని కోరారు. క్యాబినెట్ నిర్ణయాల్లో భాగంగా రోడ్ల మరమ్మత్తుకు సంబంధించి 571 కోట్ల రూపాయలతో యుద్దప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీంతోపాటు వరిపంటపై ప్రత్యేక పాలసీని తీసుకువస్తామని చెప్పారు.
కార్మికులు విధుల్లో చేరండి
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతగల ప్రభుత్వంగా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు చెప్పారు. కాగా తక్షణ సహాయం క్రింద వందకోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎటువంటీ కండీషన్లు పెట్టమని హామీ ఇచ్చారు. ప్రైవేటీకరణపై కూడ ప్రస్తుతం ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
పేదల పొట్టలు నింపాము.. కాని కొట్టలేదు
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల పోట్టలు నింపాము గాని పేదల పొట్టలు ఎక్కడ కొట్టలేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతి ఎక్కువగా జీతాలు పోందే అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులతో పాటు ఒంటరి మహిళలకు ,బీడీ కార్మికులకు పెన్షన్లను దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను కేవలం తెలంగాణలోనే అమలు అవుతున్నాయని సీఎం వివరించారు.
విపక్షాలు ఆర్టీసీ కార్మికులను బజారున పడేశాయి
కొంతమంది రాజకీయ నాయకులు, ప్రతిపక్షాల నేతలు రెచ్చగొట్టడడం వల్లే కార్మికులు రొడ్డున పడ్డారని సీఎం ఫైర్ అయ్యారు..యూనియన్లు, ప్రతిపక్ష పార్టీల మాటలతోనే కార్మికులు పెడదోవ పడుతున్నారని అన్నారు. ఈసంధర్భంగా బీజేపీపై ఆయన ఫైర్ అయ్యారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నూతన మోటారు చట్ట సవరణలో భాగంగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారని అన్నారు. కాని ఇక్కడ మాత్రం ప్రైవేటీకరణను ఆ ఎంపీలే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఆర్టీసీపై ఇంత రాద్దాంతం చేస్తున్న ఎంపీలు కనీసం అయిదువందల కోట్లు తెచ్చి ఆర్టీసీని కాపాడతారా... అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ రోజు ఉన్న పరిస్థితికి ఎవరు భాద్యత వహిస్తారని అన్నారు.
చార్జీల పెంపు
మొత్తం మీద ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజల నెత్తిన భారం పడనుంది. సమ్మె నష్టాలతో పాటు ఆర్టీసీ భవిష్యత్ నష్టాలను పూడ్చుకునేందుకు చార్జీలను పెంచుకునేందుకు ఆర్టీసీకి అవకాశం ఇస్తామని ప్రకటించారు. దీంతో కిలో మీటరకు 20 పైసల చొప్పున ...చార్జీలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎండీకి ఆదేశాలు చేస్తామని చెప్పారు. చార్జీల పెంపుదల రానున్న సోమవారం నుండే అమల్లోకి వస్తుందని చెప్పారు. చార్జీల పెంపుదల ద్వార సంవత్సరానికి సుమారు 750 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. ఇది ఆర్టీసీ నష్టాలను కొంతమేర పూడ్చుతుందని చెప్పారు.
ప్రైవేటీకరణ చేయం
తెలంగాణ బిడ్డగా ఆర్టీసీ కార్మికులను కాపాడే భాదత్య నాపై ఉంది కాబట్టి వారంలో రోజుల్లో కార్మికులతో నేరుగా మాట్లాడతానని చెప్పారు. ప్రగతి భవన్లో ప్రతి డిపోకు సంబంధించి అయిదుగురు కార్మికులను పిలిచి చర్చిస్తామని చెప్పారు. ఇక ఆర్టీసీలో ఉన్న వాస్తవాలను తెలుగులో ప్రింట్ చేసి, ప్రతి కార్మికునికి అందిస్తామని చెప్పారు. ఇప్పటికైన వాటిని అర్థం చేసుకుని పూర్తి వివరాలను అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ రూట్లను ప్రైవేటికరణను చేయమని హమీ ఇచ్చారు. దానిపై వచ్చిన వార్తలను కొట్టి పారేశారు.
చనిపోయిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు
సమ్మెలో భాగంగానే మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం ప్రకటించారు. మానవతా దృక్పథంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సమ్మెకు , సమస్యలకు కారణమైన యూనియన్లు లేకుండా చేస్తామని చెప్పారు. వారు లేకుండా ఎలాంటీ ఇబ్బందులు ఉండవని, ఇందుకు సంబంధించి ప్రతి డిపోకు ఇద్దరి చొప్పున నియమిస్తామని చెప్పారు. వారు యాజమాన్యం నుండి ఎలాంటీ ఒత్తిడి లేకుండా చూస్తారని చెప్పారు.