ఆర్టీసీ జేఏసీ భేటీ... సమ్మె కొనసాగింపుపై తర్జనభర్జన... కొద్ది గంటల్లో నిర్ణయం
ఆర్టీసీ సమ్మెపై జేఏసీ నేతల కీలక భేటి ముగిసింది. సమ్మెను లేబర్ కోర్టుకు బదిలీ చేస్తూ... కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో... అన్ని యూనియన్ల కార్మిక నేతలతో పాటు పలు డిపోలకు చెందిన నాయకత్వం ఈ సమావేశానికి హజరయ్యారు. సుమారు నాలుగు గంటలపాటు కొనసాగిన సమావేశంలో 46 రోజుల పాటు కొనసాగిన పరిణామాలు, కోర్టు ఉత్తర్వుల ప్రభావంతో పాటు లేబర్ కోర్టుకు వెళితే జరిగే అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
సమ్మె కొనసాగింపుపై చర్చ
ఈనేపథ్యంలోనే సమ్మె కొనసాగించాలా... వద్దా అనే అంశంపై చర్చ జరిగింది. సమావేశంలో సమ్మె కొనసాగింపుపై భిన్నాభిప్రాయాలు వెలువడినట్టు తెలుస్తోంది. అయితే సమ్మె కొనసాగింపులో జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పలు సంఘాల నాయకులు తెలిపారు. అప్పటివరకు సమ్మెలో పాల్గోంటామని చెప్పారు. దీంతో కోర్టు తీర్పుకు సంబంధించిన కాపీ తమకు అందలేదని, కాపీ అందేవరకు సమ్మె కొనసాగుతుందని, అనంతరం తీర్పుపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుని... సమ్మె కొనసాగింపుపై తుది నిర్ణయాన్ని వెలువరుస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు.
ఫలితాలను ఇవ్వని సమ్మె
46 రోజులుగా ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడి ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన కరువైంది. మరోవైపు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడంతో పాటు, ప్రత్నామ్నాయాలపై దృష్టిసారించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు సైతం చేపట్టింది. ప్రైవేట్ అద్దెబస్సులతో పాటు రూట్లను కూడ ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయానికి తోడు న్యాయస్థానాల్లో కూడ కార్మికులకు చుక్కెదురవుతుంది. కోర్టుల్లో పలు కేసులు కొనసాగుతున్నా...సమ్మె పరిష్కారానికి ఎలాంటీ అదేశాలు జారీ చేసిన పరిస్థితి లేదు.
కోర్టుల్లో చుక్కెదురు
దీనికి అదనంగా సమస్యను లేబర్ కోర్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరడంతో అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా సమ్మెపై కోర్టు ద్వార న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకున్న కార్మికులకు చుక్కెదురైంది. దీని ద్వార మరింత కాలం సాగదీత కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారాలను కోర్టులే ప్రశ్నించలేని చట్టాలు ఉన్నప్పుడు.. లేబర్ కమీషనర్ స్థాయిలో సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించే అవకాశాలు లేవని కార్మిక వర్గాలు భావిస్తున్నాయి.
ప్రైవేటు రూట్లపై ప్రభుత్వానికి అనుకూల వాతవరణం
మరోవైపు ఆర్టీసీ రూట్లను ప్రైవేటు పరం చేయాలనే ప్రభుత్వా నిర్ణయాన్ని సైతం కోర్టు సానుకూలంగా స్పందించింది. ప్రైవేటీకరణ చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది. ఇందుకోసం మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. ప్రపంచం ప్రైవేటీకరణవైపు అడుగులు వేస్తుందని, ఇందుకు ఉదహారణగా అనేక ప్రైవేట్ ఎయిర్లైన్స్ సంస్థలు విజయవంతంగా కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఇక కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం ప్రైవేటు బస్సులను ప్రవేశపెడితే కార్మికుల అవకాశాలు మరింత దిగజారనున్నాయి.
పెరుగుతున్న ఆత్మహత్యలు
46 రోజులుగా సమ్మె చేస్తున్నా... ఎలాంటీ పురోగతి లేకపోవడంతో కార్మికుల్లో ఆందోళన చెందుతున్నారు. దీంతో పలు జిల్లాల్లో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ తమ ప్రాణాలు విడుస్తున్నారు. ఇక మరికొందరు తమ కుల వృత్తిని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఉద్యోగాలు తిరిగి వస్తాయా... రావా అనే మీమాంసలో కార్మికులు ఉన్నారు. రాజకీయంగా, మరియు న్యాయస్థానాల ద్వార కూడా న్యాయం జరగక పోవడంతో పాటు కార్మికుల సమ్మె పూర్తిగా దిగ్భంధంలోకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాలు సమ్మె కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సమ్మెను విరమించే అవకాశాలను కూడ సంఘాలు పరీశీలిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రెండు మూడు రోజుల్లో కార్మికులు ఈ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.