ఆర్టీసీ విలీనం : జగన్ చేసింది కేసీఆర్ చెయ్యలేడా : తెలంగాణా సీఎం నిర్ణయంలో మతలబు ఇదేనా ?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న నిర్ణయాలు ఇరు రాష్ట్రాల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఏపీలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ విషయంలో తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద ప్రభావం చూపిస్తోంది. అప్పుల రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని విలీనం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకుంటే, ఇప్పటికే రెండు పర్యాయాలుగా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీని విలీనం చేసేది లేదని తేల్చి చెప్పడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చకు కారణమైంది.
అప్పుల రాష్ట్రం ఏపీలో ఆర్టీసీ విలీనం ... సీఎం జగన్ నిర్ణయం
గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి గాను టీఎస్ ఆర్టీసీ రూ.928.67 కోట్ల నష్టాల్లో ఉందని ప్రభుత్వానికి నివేదించింది. ఇక ఏపీలో రూ.6445 కోట్ల నష్టాలతో ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆ సంస్థ ఉద్యోగుల పట్ల ఉదారంగా వ్యవహరించింది. అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి పెను సవాళ్లు ముందు ఉన్నప్పటికీ ఆర్టీసీ విలీనం పై రవాణా శాఖ ఇచ్చిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న జగన్ ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు దసరా కానుకగా వారి రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఏపీ తరహాలో విలీనం చెయ్యాలని తెలంగాణా ఆర్టీసీ కార్మికుల ఆందోళన
ఇక ఏపీలో లాగే తెలంగాణలో కూడా కూడా ఆర్టీసీ ఉద్యోగులు తమను ప్రభుత్వంలో విలీనం చెయ్యాలని, తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వారి డిమాండ్ను పక్కనపెట్టి సమ్మె చేస్తే వేటు వేస్తామని హెచ్చరించింది. అంతేకాదు సమ్మె చేసిన 50,000 మంది కార్మికులపై ఎస్మా చట్టం ద్వారా ఉద్యోగాల నుంచి తొలగించామని సీఎం కేసీఆర్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో సాధ్యమైన విలీనం తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు అన్న చర్చ జరుగుతుంది.
ఏపీతో పోలిస్తే అన్నింటా మెరుగ్గానే తెలంగాణా .. కానీ విలీనానికి నో
ఏపీ తో పోల్చి చూస్తే తెలంగాణ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ఏపీ తో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాలు కూడా కాస్త తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడానికి చర్యలు తీసుకోకుండా, సీఎం కేసీఆర్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం పలు విమర్శలకు కారణమవుతోంది. పక్క రాష్ట్రం తో పోల్చి చూస్తే అన్ని విషయాలలోనూ మెరుగ్గానే ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల చిన్న చూపు చూడడం సమంజసం కాదని ఆర్టీసీ కార్మిక వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇదంతా ఆర్టీసీపై సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్ర అని భావిస్తున్నారు కార్మిక సంఘాల నాయకులు.
కేసీఆర్ నిర్ణయంలో మతలబు ఇదేనని చర్చ
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు తలొగ్గితే రేపు ప్రతి శాఖలోనూ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఆందోళన బాట పడతారని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇది ఒక రివాజుగా మారుతుందని భావిస్తున్న నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికుల పై కొరడా ఝుళిపిస్తే మిగతావారు సైలెంట్ గా తన పని తాము చేసుకుంటారని గులాబీ బాస్ భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇక అంతే కాదు ఏపీలో జగన్ సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం సత్ఫలితాలను ఇవ్వదు అన్న భావన కూడా సీఎం కేసీఆర్ కు ఉన్నట్లుగా తెలుస్తోంది.
విలీన నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ ఖజానాపై పెను భారం అనే ఆలోచన
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తే, ఆర్టీసీని ప్రభుత్వ శాఖలో విలీనం చేస్తే ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడుతుంది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి అంత మంచిది కాదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇక అంతే కాదు ఆర్టీసీ ఆస్తులపై కెసిఆర్ కన్నుపడిందని ,సంస్థకు చెందిన 60 వేల కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని కూడా కార్మిక సంఘాల్లో చర్చ జరుగుతోంది. ఉద్యోగులను, కార్మికులను అణచి వేయడం లక్ష్యంగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. పాలించే ప్రభుత్వ కనుసన్నల్లో అధికారులు, కార్మికులు పని చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక మతలబు ఇదే అని కార్మిక వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.