TSRTC STRIKE : 13వ రోజు .. సమ్మె విరమించేది లేదన్న జేఏసీ .. చర్చించేది లేదంటున్న సర్కార్
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఒకపక్క హైకోర్టు ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ప్రభుత్వానికి, కార్మికులకు పట్టింపులకు, పంతాలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈరోజు సాయంత్రం లోపు చర్చ జరగాలని డెడ్లైన్ విధించింది. కానీ ఆర్టీసీ కార్మికులతో, ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదు. సమ్మె విరమించి వెళ్లేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా లేరు.
కార్మికులతో చర్చలు లేనట్టే అన్న సంకేతాలిచ్చిన కేసీఆర్
ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని చెప్పినా కార్మికులు పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విర మించకుండా, ఇంత మొండితనం గా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. కార్మికులతో ఇక చర్చలు లేవని కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కోర్టులో ప్రభుత్వ వాదనలు బలంగా వినిపించాలని నిర్ణయించారు.
సమ్మె మాట భవిష్యత్ లో వినిపించకుండా చేస్తా అంటున్న సీఎం
సమ్మెతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని, భవిష్యత్లో ఎప్పుడు కార్మికుల నోటి నుండి సమ్మె మాట వినిపించకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కోర్టు ఆదేశించినా చర్చల పట్ల సానుకూలత వ్యక్తం చెయ్యటం లేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి చర్చలకు వారే ఒకడుగు వెనక్కు తగ్గి రావాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించిన సీఎం కేసీఆర్ ఇదే అంశంపై మరోసారి చర్చలు జరపనున్నారు. మంత్రి పువ్వాడ, రవాణా శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
13వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
హైకోర్టు ఆదేశం, కార్మికుల సమ్మె పై ప్రధానంగా చర్చ జరపనున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలు, తర్వాత పరిణామాలు, తాము కోర్టులో వినిపించ వలసిన వాదనల పైన ప్రధానంగా చర్చ జరగనుంది. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజుకి చేరుకుంది. ప్రభుత్వం ఇంత ఆందోళన చేస్తున్న పట్టించుకోకపోవడంతో, కార్మికుల ఆత్మహత్యల బాట పడుతున్న చలించకపోవడంతో రోజు రోజుకి ఉదృతంగా కొనసాగుతోంది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లన్నీ కార్మికుల నిరసనలతో దద్దరిల్లుతున్నాయి.
నేడు బైక్ ర్యాలీలతో నిరసన
ఇక 13వ రోజు సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు చేపట్టారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. న్యాయవాదులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచి పోరాటం సాగిస్తున్నాయి. చర్చలకు వెళ్తామని, చర్చలు జరిగిన తర్వాత సమ్మె విరమిస్తామని ఆర్టీసీ కార్మిక జేఏసీ ప్రకటించింది. అయితే కోర్టు ఆదేశాన్ని పక్కనపెట్టి తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా కార్మికులు ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వం మండిపడుతోంది. ఏది ఏమైనా చర్చలకు తాము సిద్దమే అని చెబుతూనే.. సమ్మెను మాత్రం కొనసాగిస్తున్నారు. సమ్మె చేస్తే చర్చలకు పిలిచే అవకాశమే లేదని ప్రభుత్వం తేల్చి పారేసింది.