TSRTC STRIKE : మెట్టు దిగమంటున్న కోర్టు .. మెట్టు దిగెదెవరు... కార్మికులా ? ప్రభుత్వమా?
ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం అవుతుందా? ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరుపుతుందా? ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అంగీకరిస్తారా? కార్మికుల డిమాండ్స్ పరిష్కారం చెయ్యటం ప్రభుత్వానికి సాధ్యమేనా? అసలు సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి అనుమతిస్తారా? ఇరు వర్గాల మధ్య ఏర్పడిన అగాధం తగ్గుతుందా? లేకా ఇలాగే కొనసాగుతుందా? హైకోర్టు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని చేసిన సూచనల నేపధ్యంలో అన్నీ ప్రశ్నలే .
మెట్టు దిగి చర్చలు జరపాలని ఇరువర్గాలకు హైకోర్టు సూచన
ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో ఆర్టీసీ వ్యవహారాన్ని విచారించిన హైకోర్టు పంతాలకు,పట్టింపులకు పోయి ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని అటు ప్రభుత్వాన్ని,ఇటు ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. మొండి పట్టుదలకి వెళ్ళడానికి సమయం కాదని,అన్ని సమస్యలు చట్టబద్ధంగా పరిష్కారం కావని,మానవీయ కోణంలో చర్చలు జరపాలని హైకోర్టు సూచించింది. ఇరువర్గాలు పంతాన్ని విడనాడాలని,మెట్టు దిగి,బెట్టు వీడి సానుకూలంగా చర్చలు జరపాలని,సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు పేర్కొంది.
చర్చల తర్వాతే సమ్మె విరమిస్తామని ప్రకటించిన ఆర్టీసీ కార్మిక జేఏసీ
ఎవరికివారు పట్టుదలతో ఉన్న నేపథ్యంలో బెట్టు వీడేది ఎవరు? మెట్టు దిగేది ఎవరు? అన్న చర్చ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోర్టు పేర్కొంది. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిగిన తర్వాతే ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని ఆర్టీసీ కార్మిక జెఎసి నిర్ణయం తీసుకుంది. అంతేకాదు కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అటు ఆర్టీసీ యాజమాన్యం కానీ,ప్రభుత్వం గానీ చర్చలకు పిలిస్తే వెళతామని, సమస్య పరిష్కారం మాత్రమే కావాలని ఆర్టీసీ కార్మిక జెఎసి ప్రకటించింది.
హైకోర్టు వ్యాఖ్యలపై,ప్రశ్నలపై స్పందించని ప్రభుత్వం
ఇక హైకోర్టు చేసిన సూచనలపై,పెట్టిన చీవాట్లపై,చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. చర్చలు నిర్వహిస్తామన్నమాట ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం.
ఇక అదే సమయంలో,గత 12 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా సమ్మె విరమించుకోవడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. అంతేకాదు ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా
వెంటనే ప్రభుత్వం,కార్మికులు ఓ మెట్టు దిగి చర్చలు ప్రారంభించాలని సూచించింది. గత నెల జీతాలు చెల్లించాలని ఆదేశించింది.ఆర్టీసీ కార్మికులు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. కానీ ఈలోపే సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆర్టీసీ కార్మికులను,ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. కానీ చాలా మొండితనంతో వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ కోర్టు సూచనల నేపధ్యంలో అయినా స్పందిస్తారా అన్నది తెలియాల్సి వుంది.
చర్చలకు మెట్టు దిగేది ఎవరో అన్న ఆసక్తి
మరోవైపు ఆర్టీసీ జేఏసీ కి ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని ప్రకటించిన కేకే తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే నే మధ్యవర్తిగా మాట్లాడతానని కేశవరావు చెబుతున్నారు.సమ్మె విరమించి చర్చలకు వెళ్లే ఆలోచనలో ఆర్టీసీ కార్మికులు లేరు. ఉద్యోగాలను తొలగించామని ప్రకటించి మళ్లీ చర్చలకు పిలిచే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వము లేనట్లుగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో కోర్టు నిర్దేశించిన గడువు గురువారం సాయంత్రంతో ముగియనున్న నేపధ్యంలో చర్చల దిశగా తొలి అడుగు ఎవరిది పడుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది .