హుజుర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఆర్టీసి సెగ! కారు గెలుపుపై అలుముకుంటున్న బస్సు మబ్బులు!
హైదరాబాద్ : హైదరాబాద్ ఆర్టీసి కార్మిక సంఘాల నేతలతో నెలకొన్న పరిస్థితుల ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె, అందుకు ఉపాధ్యాయ సంఘాలు, రెవెన్యూ వర్గాల సంఘీభావం వెరసి హుజూర్ నగర్ ఉప ఎన్నికమీద తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఘా వర్గాల ప్రకారం ఇప్పటికీ గులాబీ పార్టీకి విజయావకాశాలు గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ఇటువంటి సమయంలో సమీకరణాలను తమ వైపునకు తిప్పుకోవడం, ఇప్పుడున్న పరిస్థితులను అధిగమించేందుకు ఏం చేయాలనే అంశాలపై అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని వ్యతిరేకించే గులాబీ వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
ఆర్టీసి ఉద్యోగులను సీఎం తక్కువ అంచనా వేస్తున్నారు..!కార్మికులంటే ఏంటో చూపిస్తామన్న అశ్వద్దామ రెడ్డి
హుజూర్ నగర్ లో గులాబీ పార్టీకి గడ్డు పరిస్ధితులు.. ప్రభావం చూపిస్తున్న ఆర్టీసి ఇష్యూ..
ఐతే సైదిరెడ్డిపై గతంలో వ్యతిరేక ప్రచారం చేసిన వారిలో సొంతవారే ఎక్కువగా ఉండటం ఒకింత గుబులు పుట్టిస్తుంది. ఇప్పుడు కూడా అదే వర్గం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందనే అనుమానాలు గులాబీ పార్టీని కలవరపెడుతున్నాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉద్యోగవర్గాల నుంచి కూడా ప్రభుత్వం పై వ్యతిరేకత పెల్లుబుకుతుంది. స్థానికంగా లోటుపాట్లు, సీపీఐతొ పొత్తు ఎంత వరకూ లాభిస్తుందనే అంశంలో అయోమయం నెలకొంది. ఇన్ని ప్రతికూల పరిస్థితులతో టీఆర్ఎస్ గెలుపు నిజంగా సవాల్గా మారిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పరిస్ధితులు ఇంత ప్రతికూలంగా తయారైన నేపథ్యంలో ఆర్టీసి కార్మికులతో చెలరేగిన పంచాయితీ హుజూర్ నగర్ అభ్యర్ధి సైదిరెడ్డికి శరాఘాతంలా పరిణమించినట్టు తెలుస్తోంది.
సైదిరెడ్డికి మళ్లీ చేదు అనుభవమే.. తేల్చి చెప్తున్న నిఘా వర్గాలు..
తాజాగా హుజూర్నగర్ ఉప ఎన్నిక అధికార పార్టీని వణికిస్తోంది. ఆర్టీసీ ఎదురుదెబ్బలతో మున్ముందు ఎటువంటి పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందనే ఆందోళన కూడా పార్టీలో నెలకొంది. ఓ పక్క టీఆర్ఎస్ వైఫల్యాలు తమను గట్టెక్కిస్తాయనే ధైర్యంగా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపద్యంలో ఆర్టీసి అంశాన్ని ఓ ఆయుధంలా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. సకల జనుల సమ్మె లో కార్మికులను వాడుకుని, ఇప్పుడు వారిని పట్టించికునే దిక్కులేదని, అందుకు చంద్రశేఖర్ రావు వ్యవహారమే నిదర్శనమనే అంశాన్న జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.
చిగురిస్తున్న కాంగ్రెస్ ఆశలు.. గెలుపుపై ఉత్తమ్ ధీమా..
అంతే కాకుండా హుజూర్ నగర్ లో పోలీసులు అధికార గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు. మద్యాన్ని, డబ్బులను విచ్చలవిడిగా అధికార పార్టీ పంపిణీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేయటంతో ఉద్యోగ వర్గాల నుంచి కూడా అధికార పార్టీ వ్యతిరేకతను చవిచూడాల్సి రావచ్చంటన్నారు. రెవెన్యూ ఉద్యోగ వర్గాలు కూడా దాదాపు చంద్రశేఖర్ రావు వైఖరిని వ్యతిరేకిస్తున్నాయి. రైతులు, కుల వృత్తుల్లోనూ మొదట్లో చంద్రశేఖర్ రావు పై ఉన్న ఆదరాభిమానాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయనే గుసగుసలు లేకపోలేదు.
ఆర్టీసి ఉద్యోగులకు ప్రతిపక్షాల సంఘీభావం.. ఉప ఎన్నిక పై తీవ్ర ప్రభావం..
ఇక సీపీఐతో పొత్తు కలసివస్తుందనుకునే అంశం నియోజక వర్గంలో ఎక్కడా కనిపించడం లేదు. అక్కడా సీపీఎం నుంచి వ్యతిరేకత తప్పట్లేదు. నిన్నటి వరకూ చంద్రశేఖర్ రావును తిట్టిపోసి ఇప్పుడు వీరుడు, శూరుడంటూ పొగడ్తలు కురిపిస్తున్న సీపీఐ తీరుపై కూడా విమర్శలు తప్పట్లేదు. ఇవన్నీ టీఆర్ఎస్కు విఘాతాలుగా పరిణమించాయి. వాస్తవానికి హుజూర్నగర్ ఉప ఎన్నిక చంద్రశేఖర్ రావు పనితీరుకు రిఫరెండంగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉపఎన్నికలో విజయం సాధించాలనే లక్ష్యంతో స్వయంగా చంద్రశేఖర్ రావు బాధ్యతలు తీసుకున్నారు. కాని ఆర్టీసి సమ్మె, ఉద్యోగుల తిరుగుబాటు, ఇతర కార్మిక సంఘాల సంఘీభావం, రాజకీయ పార్టీల విమర్శాలు కలిసి హుజూర్ నగర్ ఉప పోరులో సైదిరెడ్డికి చేదు అనుభవం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో కారుకు వ్యతిరేకంగా బస్సు మేఘాలు దట్టంగా అలుముకున్నట్టు చర్చ జరుగుతోంది.