పని చేయని సీఎం డెడ్ లైన్లు..!కేసీఆర్ చేయి దాటిన సమ్మె..! ట్రబుల్ షూటర్ రావాల్సిందేనా..?
హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె 38వ రోజుకు చేరుకుంది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు లేవని, కేవలం న్యాయస్థానం మాత్రమే తమకు న్యాయం చేస్తుందరి ఆర్టీసి కార్మికులు విశ్వసిస్తున్నారు. అయినప్పటికి ప్రభుత్వం ఆహ్వానిస్తే చర్చల్లో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నామని కార్మిక లోకం స్పష్టం చేస్తోంది. నిన్న జరిగిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం కూడా హిస్మాత్మకంగా మారడంతో కార్మికులు మరింత పట్టుదలగా సమ్మెను ముందుకు తీసుకెళ్లేందుకు నిశ్ఛయించినట్టు తెలుస్తోంది.
సీఎం చేజారిన కార్మికుల సమ్మె..
ముఖ్యమంత్రి చంద్రశఖర్ రావు ఎన్ని డెడ్ లైన్లు పెట్టినా కార్మికులు పెద్దగా స్పందించలేదు. దీంతో ఆర్టీసి కార్మికుల సమ్మె, కార్మికుల వ్యవహారం చంద్రశేఖర్ రావు చేయి జారిపోయినట్టు కూడా స్పష్టమవుతోంది. కార్మికులు కూడా సీఎం చంద్రశేఖర్ రావు మాటలను అంతగా నమ్మే పరిస్థితిలో లేరనే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సమ్మెను విరమింప జేయడానికి, కార్మికులను శాంతింపజేయడానికి తెలంగాణ వ్యవహారాల పట్ల ట్రబుల్ షూటర్ ముద్ర వేసుకున్న మంత్రి హరీష్ రావును రంగ ప్రవేశం చేయించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక రచిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
38వ రోజుకు చేరిన సమ్మె.. పట్టు వీడని కార్మికులు..
ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. తెలంగాణ ఉద్యమం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఆర్టీసీ సమ్మె పూర్తిస్థాయిలో నడవడం ఇదే మొదటిసారి కావడం ప్రగతి భవన్ వర్గాలను కలవరపెడుతోంది. గత 38 రోజులుగా చాలావరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సీఎం చంద్రశేఖర్ రావు కూడా ఈ సమ్మెపై గట్టి పట్టుదలగా ఉన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చల అంశం పట్ల స్పందిస్తూ అదో ముగిసిన అద్యాయంగా అభివర్ణించారు. కార్మికులు దిగిరావాల్సిందే తప్ప తను మాత్రం దిగివచ్చే సమస్యే లేదని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. పైగా డెడ్లైన్లు విధిస్తూ, కార్మికుల ఉద్యోగాలు పోయినట్టేనని, రాష్ట్రంలో రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తామని స్వయంగా ప్రకటించారు. అందుకోసం కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు.
తీవ్రతరమైన సమ్మె..
హైకోర్టు జోక్యం చేసుకొని ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చింది. అంతే కాకుండా ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి ఔదార్యం తో వ్యవహరించాలని హైకోర్టు ప్రభుత్వానికి అనేక సార్లు సూచనలు కూడా చేసింది. అయినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే, ఓ పక్క కోర్టు, మరో పక్క కార్మికులు, ఇంకోపక్క కేంద్రప్రభుత్వం జోక్యంతో సమస్య పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులతో చర్చలు మినహా చేసేదేమి లేదన్న విషయం సీఎం చంద్రశేఖర్ రావుకు అర్ధమైందని, ఆ వైపు చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇక్కడే ట్రబుల్ షూటర్ పేరు తెర మీదకు వస్తోంది.
తాడోపేడో తేల్చుకునే ధోరణిలో సీఎం..
కాగా కార్మిక నాయకులతో చర్చలు జరిపేందుకు ఓ కమిటీని వేసి, దాని బాద్యతలను ట్రబుల్ షూటర్గా పేరున్న మంత్రి హరీష్రావుకు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఐతే సీఎం చంద్రశేఖర్ రావు కాకుండా ఆర్టీసి కార్మికుల సమ్మె హరీష్ రావు ద్వారా పరిష్కరించబడితే అది సీఎం స్థానంలో ఉన్న చంద్రశేఖర్ రావుకు అవమానకరంగా ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. సున్నితమైన అంశం పట్ల చాకచాక్యంగా వ్యవహరించడం చేతకాలేదనే అపవాదు మూటకట్టుకోవాల్సి వస్తుందనే చర్చ కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఐతే కార్మిక శ్రేయస్సును సీఎం మనస్పూర్తిగా కోరుకున్నట్టైతే బేషజాలకు వెళ్లకుండా సమస్యను పరిష్కరించేందకు ట్రబుల్ షూటర్ ను రంగంలోకి దించాలనే డిమాండ్ వినిపిస్తోంది.