ఆర్టీసీ సమ్మె .. పలు చోట్ల ఉద్రిక్తత .. ఎంపీ బండి సంజయ్ అరెస్ట్
కరీంనగర్లో పదకొండవ రోజు జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించని ప్రభుత్వం వైఖరిపై ఆగ్రహజ్వాలలు మిన్ను ముడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ మనసు మార్చే వరకు, తమ విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం మార్చుకునే వరకు వివిధ రూపాల్లో ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల మద్దతుతో పోరాటం సాగించాలని ఆర్టీసీ కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఆర్టీసీ కార్మికులు 11వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నల్లగొండ బస్టాండ్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నల్లగొండ డిపోను ఆర్టీసి కార్మికులు, ప్రజాసంఘాల నేతలు ముట్టడించారు. బస్సులు కదలకుండా కార్మికులు అడ్డంగా పడుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. 30 మంది కార్మికులు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.కరీంనగర్లో ఆర్టీసీకి మద్దతుగా చేపట్టిన బీజేపీ ర్యాలీలోనూ పోలీసులకు బిజెపి కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వాహనాలకు అడ్డంగా బీజేపీ కార్యకర్తలు పడుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఉదృతంగా మారుతున్నా అవేమీ పట్టనట్టు తెలంగాణ సర్కార్ వ్యవహరించటం ఆర్టీసీ కార్మికులకు ఆందోళన కలిగిస్తుంది. తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు, ఉద్యోగ భద్రత కల్పించే వరకూ ఉద్యమాన్ని వీడేది లేదని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్తుంటే, ఆర్టీసీ కార్మికులకు అండగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మేమున్నామంటూ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయి.