ఆర్టీసీలో మరోకీలక నిర్ణయం.. తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులరైజ్
ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక ఉద్యోగులుగా చేస్తున్న 296 మంది డ్రైవర్లు, 63 కండక్టర్లను రెగ్యులరైజ్ చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో సుమారు 240 రోజుల పాటు ఉద్యోగం చేసిన వారిని రెగ్యులరైజ్ చేసినట్టుగా ప్రకటించింది.
ఆర్టీసీ సమ్మెతో రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్
తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె తర్వాత అనేక కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెతో నేరుగా రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ నష్టాలకు ప్రధాన కారణం కార్మికుల తరఫున పోరాటం చేస్తున్న కార్మిక సంఘాల నాయకులే కారణమని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో విలీన ప్రతిపాదనతో సమ్మెకు దిగిన కార్మిక సంఘాల నేతలను ఎక్కడికక్కడ కట్టడి చేశారు.
కార్మికులతో నేరుగా మంతనాలు
ఈ నేపథ్యంలోనే కార్మికులతో నేరుగా సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. అనంతరం వారికి అనేక వరాలు ప్రకటించారు. ప్రధానంగా తాత్కలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, సమ్మెలో భాగంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు మహిళలకు కావాల్సిన సదుపాయాలు కల్పించడం అందుకు సంబంధించి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మహిళ ఉద్యోగులకు రాత్రి ఎనిమిది గంటల వరకే డ్యూటీలు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కార్మికుల సంక్షేమం కోసం ప్రతి డిపోలో సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేశారు. ఇలా రెండు సంవత్సారాల పాటు యూనియన్లు లేకుండా పనిచేసి... అనంతరం పరిస్థితిని బట్టి ఆర్టీసీపై మార్పులు తీసుకురావాలనే సంకల్పంతో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
పదిరోజుల్లోనే కారుణ్య నియామాకాలు
ఈ నేపథ్యంలోనే అంత్యంత వేగంగా సమ్మె కాలంలో మృత్యువాత పడిన కార్మికుల పిల్లలకు కేవలం పది రోజుల్లోనే వారికి ఉద్యోగాలు కల్పించారు. మొత్తం సమ్మె కాలంలో 38 మంది కార్మికులు చనిపోగా అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చారు. అయితే కారుణ్య నియామాకాలు కొన్ని సంధర్భాల్లో సంవత్సరాలుగా సమయాన్ని తీసుకునే పరిస్థితి ఉండేది. అది ఆర్టీసీలో అయితే ఇంకా సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంటుంది. కానీ సంస్థను మెరుగైన దిశగా తీసుకువెళ్లేందుకు అధికారులు సైతం వేగంగా పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాత్కలిక ఉద్యోగులను కూడ రెగ్యూలరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.