మరో‘సారీ’ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ చర్చలు విఫలం, అర్ధరాత్రి నుంచి సమ్మె
టీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతోంది. మరి కొన్నిగంటల్లో ఎక్కిడి బస్సులు అక్కడే నిలిచిపోనున్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ మీడియాకు తెలిపింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని వెల్లడించింది. అనివార్య పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నామని జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు.
ఆర్టీసీ జేఏసీ నాయకులతో ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్, సునీల్ శర్మ, రామకృష్ణారావు తదితరులు ఇవాళ కూడా చర్చలు జరిపారు. కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక నేతలు పట్టుబడుతున్నారు. పీఆర్సీ, ఐఆర్ తదితర 26 డిమాండ్లు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో చర్చలు మరోసారి విఫలమయ్యాయి. నిన్న రాత్రి కూడా ఐఏఎస్ కమిటీ సభ్యులు ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులు గ్రామాలకు వెళుతుంటారని సమ్మెపై పునరాలోచన చేయాలని ఐఏఎస్ కమిటీ సభ్యులు జేఏసీ నేతలను కోరారు. కానీ వారి నుంచి ఆశించిన స్పందన రాలేదు. తమ డిమాండ్లను తీర్చాలని పట్టుబట్టి కూర్చొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అన్నారు. సమ్మెలో ఉద్యోగులు పాల్గొంటే డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని కఠిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటే ఎస్మా ప్రయోగిస్తామని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే.