ఆర్టీసీ రణం ..చర్చలు మొదలుపెట్టాకే ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్య క్రియలన్న భార్య జయ.. జేఏసీ ప్రతిన
ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతితో కరీంనగర్ రగిలిపోతోంది . ఆర్టీసీ కార్మికులు 28 రోజులుగా సమ్మె చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వ వైఖరిపై అటు ఆర్టీసీ కార్మిక జెఎసి, ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికి కార్మికుల సమ్మె పై సర్కారు తీరు వల్ల 17 మంది మరణించారు. ఇక ఈ మరణాలు ఇక్కడితో ఆగాలని, తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ కార్మిక జేఏసీ. అంతేకాదు చర్చలు మొదలు పెట్టాకే డ్రైవర్ బాబు అంత్యక్రియలు ప్రారంభిస్తామని అటు ఆర్టీసీ కార్మిక జే.ఏ.సి,మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు భార్య జయ తెలంగాణ సర్కార్ పై పోరాటానికి సిద్ధమయ్యారు.
28 రోజులుగా కొనసాగుతున్న సమ్మె.. పిట్టల్లా రాలిపోతున్న ఆర్టీసీ కార్మికులు
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. సమ్మె చేస్తున్న కార్మికులను సర్కార్ సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని ప్రకటించింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగానూ ప్రయత్నించని తెలంగాణ సర్కార్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన మనోవేదనకు గురి అవుతూ పిట్టల్లా రాలిపోతున్నా పట్టింపులేనట్టు వ్యవహరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ మరణాలకు అడ్డుకట్ట వేయాలని, కరీంనగర్లో డ్రైవర్ బాబు మరణం చివరి మరణం కావాలని గట్టిగానే రణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ కార్మికులు, కార్మిక కుటుంబాలు, ప్రతిపక్ష పార్టీలు. అందుకే డ్రైవర్ బాబు అంత్యక్రియలు నిర్వహించాలంటే, ప్రభుత్వం చర్చలు జరపాలి అన్న డిమాండ్ ను తెరమీదకు తీసుకువచ్చారు.
బాబు మృతితో రగులుతున్న కరీంనగర్.. ఉమ్మడి జిల్లా బంద్
సరూర్ నగర్ స్టేడియంలో ఆర్టీసీ కార్మికుల నిర్వహించిన సకల జన భేరి సభకు వెళ్లి సభలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతదేహం కరీంనగర్ కి చేరింది. దీంతో కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బాబు మృతదేహాన్ని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కు తీసుకెళ్తామని కార్మికులు భావించినా పోలీసులు అడ్డుకొని మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఇక ఇంటికి తీసుకు వెళితే ర్యాలీ లాంటివి ఏవి లేకుండా మృతదేహానికి అంత్య క్రియలు నిర్వహిస్తారని పోలీసులు భావించారు. కానీ ఆందోళన ఉధృతం అయింది. కరీంనగర్ బంద్ కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మిక జే.ఏ.సి, ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ కరీంనగర్ కు చేరారు. ఇక ఈ మరణం చివరి మరణం కావాలని, మరొక ఆర్టీసీ కార్మికుడు ఈ విధంగా మృతి చెందడానికి వీల్లేదని జెఎసి నాయకులు ప్రతినబూనారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
చర్చలు జరిపేవరకు అంత్యక్రియలు చెయ్యబోమని చెప్పిన మృతుని భార్య జయ
ఇక సమస్య పరిష్కారమయ్యే వరకు మృతదేహాన్ని తీసేది లేదని ఆర్టీసీ డ్రైవర్ భార్య జయ తేల్చిచెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఇప్పటికే 17 మంది చనిపోయారు అంటున్నారు జయ. డ్రైవర్ బాబు మరణం చివరి మరణం కావాలని, మరొక కార్మికుడు చనిపోవడానికి వీల్లేదని మృతి చెందిన డ్రైవర్ బాబు భార్య జయా అంటున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్చలు జరిపే వరకు, సమస్య పరిష్కారం అయ్యేవరకూ మృతదేహాన్ని తియ్యమని తేల్చి చెబుతున్నారు. తన భర్త మృతి పట్ల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు జయ ఇక బాబు కుమార్తెలు అయిన దివ్య, సంధ్య, కుమారుడు సాయి కిరణ్ తండ్రిని చూసి విలపిస్తున్న తీరు అక్కడ ఉన్న వారందరి మనసులను ఆవేదనకు గురిచేస్తోంది.
సీఎం కేసీఆర్ తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం .. బాబు కుటుంబానికి అండగా ఎంపీ బండి సంజయ్
ఇంత మంది కార్మికులు మృత్యువాత పడుతున్నా, గుండెపోటుతో కొందరు బలవన్మరణాలతో మరికొందరు మృతి చెందుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాబు ఇంటి వద్ద కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆ కుటుంబానికి అండగా నిలబడి ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉన్నారు. సీఎం కేసీఆర్ మెడలు వంచి వరకు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేసి తీరుతామని అన్నారు. ఇక బాబు అంత్యక్రియలు నిర్వహించాలంటే ప్రభుత్వం తక్షణం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
బాబు మరణంతో ఉధృతంగా ఆర్టీసీ రణం .. ఉద్రిక్తంగా వాతావరణం
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు బాబు ఇంటికి చేరుకుంటున్నారు. ఆర్టీసీ కార్మిక కుటుంబాలు ఆవేదనతో రగిలి పోతున్నాయి. గతంలో పనిచేసిన జీతం ఇవ్వకపోవడం తో పాటుగా, డిస్మిస్ కార్మికులు అన్న పేరుతో ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని, ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయంతో తమను భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మనోవేదనే ఆర్టీసీ కుటుంబాలలో చావు డప్పు మోగిస్తుందని ఆర్టీసీ కార్మిక కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే చివరి మర మరణం కావాలని, అందుకోసం అందరూ ఏకతాటి మీదకు రావాలని ఆర్టీసీ డ్రైవర్ బాబు భార్య జయ కోరుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక లోకం కదిలింది. ప్రభుత్వంతో ఈసారి మరింత ఉధృతంగా రణానికి సిద్ధమైంది.