ఆర్టీసీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాదు, కార్మికులేమీ బానిసలు కాదు, సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారని తెలిపారు. కానీ వారి సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
ఉద్యోగాలనే ఫణంగా పెడితే
సకల జనుల సమ్మెలో కార్మికులు తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి ఉద్యమం చేశారని విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ విషయాన్ని ఆ సమయంలో పలు వేదికలపై గుర్తుచేశారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల జీవితాలను తీర్చిదిద్దుతామని హామీనిచ్చి బుట్టదాఖలు చేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో కార్మికుల గోడును పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండకూడదని ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు ఏమయ్యాయని రేవంత్ ప్రశ్నించారు. సీఎం అయ్యాక మరచిపోయారా అని మండిపడ్డారు.
అప్పుడు అలా
ఆర్టీసీ కార్మికులనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం సరికాదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులకు న్యాయం చేయాలనే ఆలోచన లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని సంకేతాలు ఇస్తూ కార్మికుల జీవితాలతో ఆటాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు లేదని రేవంత్ అన్నారు. గత ఐదేళ్లుగా ఒపిక పట్టి, ఇక న్యాయం చేయరని నిర్ణయించుకొని కార్మికుల నిరసన బాట పట్టారని రేవంత్ తెలిపారు.
మారో మార్గం లేక
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులకు సమ్మె తప్ప మరో మార్గం లేదని రేవంత్ అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లపై కూడా సానుకూలంగా స్పందించలేదని కఠిన మనస్సు కేసీఆర్ది అని ధ్వజమెత్తారు. కార్మికుల సమస్య ఏంటో తెలుసుకున్నారా ? ఐదున్నరేళ్లలో వారిని ఒక్కసారైనా పిలిచారా అని ప్రశ్నించారు. వారి సాధక, బాధలు తెలుసుకునే ప్రయత్నం చేశారా ? అని ప్రశ్నించారు. చిరు ఉద్యోగులపై సీఎం కేసీఆర్ తన ప్రతాపం చూపడం సరికాదన్నారు.
డెడ్లైన్
సమస్య సాధనం కోసం సమ్మె చేస్తున్న వారికి డెడ్లైన్ విధించడం ఏంటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ నియంతృత్వ ధోరణి సరికాదని హితవు పలికారు. ఆర్టీసీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాదని కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. కార్మికులు, ఉద్యోగులే తప్ప.. బానిసలు కాదన్నారు. బాధ్యతగల పదవీలో ఉన్న కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను బ్లాక్ మెయిల్ చేయడం సరికాదన్నారు. తమ సమస్యల కోసం పోరుబాట పట్టిన కార్మికులను అభినందిస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ, దసరా సందర్భంగా సమ్మె చేపడితే ప్రజలకు ఇబ్బంది కలుుగుతుందనే సోయి ప్రభుత్వానికి ఉండాలే తప్ప.. కార్మికులపై బ్రహ్మస్త్రం ప్రయోగిస్తామని బెదిరించడం సరికాదని రేవంత్ అన్నారు.
కొరివి అని..
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో న్యాయం ఉందని రేవంత్ చెప్పారు. కానీ వాటిని తూతూ మంత్రంగా చర్చలు జరిపి, తర్వాత కమిటీనే రద్దు చేయడం సరికాదన్నారు. సమ్మె విరమణకు చొరవ తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకోవడం అంటే కొరివితో తల గొక్కోవడమే అని గతంలో కేసీఆర్ ప్రకటన చేసి, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.