తప్పువార్తలని 'నమస్తేతెలంగాణ'దగ్ధం, కేసీఆర్ బొమ్మా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టిబొమ్మను శుక్రవారం దగ్ధం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తోన్న విషయం తెలిసిందే. ఫలక్నుమా డిపో వద్ద ధర్నాలో పాల్గొన్న కార్మికులు... కేసీఆర్ దిష్టిబొమ్మకు కార్మికులు శవయాత్ర నిర్వహించారు.
నమస్తే తెలంగాణ దినపత్రికల ప్రతుల దగ్ధం
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై అసత్య వార్తలు ప్రచురిస్తున్నారంటూ నమస్తే తెలంగాణ దిన పత్రిక ప్రతులను కార్మికులు దగ్ధం చేశారు. తెలంగాణలో నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఛానల్స్ను నిషేధించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు.
జహీరాబాద్ డిపోలో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం
మెదక్ జిల్లాలోని జహీరాబాద్ డిపోలో ఓ ఆర్టీసీ కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశారు. ఈ సంఘటనతో తోటి కార్మికులు అప్రమత్తమై అతన్ని కాపాడారు. కార్మికులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొన్ని బస్సులు నడుపుతున్నామని ఆర్ఎం రాజు చెప్పారు.
ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ఆర్టీసీ డిపో వద్ద ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
సమ్మె కారణంగా పోలీసుల సాయంతో డిపోనుంచి బస్సులు తీసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయాత్నానికి కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నకు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.