ఆర్టీసీ కుటుంబాలకు ఉద్యోగాలు .. మొదటి విడతలో పదిమందికి అవకాశం
ఆర్టీసీ సమ్మెలో భాగంగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతగా జీహెచ్ఎంసీ పరిధిలో చనిపోయిన పదిమంది కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించింది. ఇందుకోసం ప్రతి కుటుంబానికి ఒక్కోక్కరిని ఎంపిక చేశారు.
మొత్తం పదిమందిలో నలుగురికి జూనియర్ అసిస్టేంట్, ఒకరికి ఆర్టీసీలోనే కండక్టర్ ఉద్యోగం ఇవ్వనుండగా మిగిలిన అయిదుగురికి పోలీస్ డిపార్ట్లోని కానిస్టేబుల్స్గా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇందుకోసం వారికి నియామక పత్రాలను కూడ అందించారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహయం కూడ అందించారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. 52 రోజుల పాటు జరిగిన సమ్మెలో అందోళన చెందిన ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు వదిలారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో సమ్మె మరింత ఉదృతంగా మారింది. దీంతో ప్రభుత్వం సమ్మె విరమణ తర్వాత సీఎం కేసీఆర్ నేరుగా కార్మికులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు వరాలు కురిపించడంతో పాటు సమ్మెలో భాగంగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.
వారికి ఆర్టీసీలో కాని , లేదా ఇతర ప్రభుత్వ విభాగాల్లో గాని ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాగా మొత్తం 52 రోజుల సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది కార్మికులు మృతి చెందినట్టు సమాచారం. అయితే ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే పదిమంది ఉండడంతో వారి కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టుంది.