ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు ... కుటుంబ సభ్యులతో కలిసి మౌన నిరసన దీక్షలు
ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు కొనసాగుతోంది. ఈరోజు ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మౌని నిరసన దీక్షలకు ఉపక్రమించారు. సీఎం కేసీఆర్ తమ కుటుంబ సభ్యుల ఆవేదన చూసైనా మనసు మార్చుకోవాలని కుటుంబాలతో సహా రోడ్డెక్కారు. అయినా సీఎం కేసిఆర్ ఆర్టీసీ కార్మికుల విషయంలో సానుకూలంగా లేరని తాజా పరిణామాల ద్వారా అర్థమవుతోంది. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల తొలగింపు నిర్ణయం పట్ల పునరాలోచించే ధోరణి ఏమాత్రం సీఎం కేసీఆర్ కు లేదు.
సీఎం కేసీఆర్ మనసు మార్చే వరకు, తమ విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం మార్చుకునే వరకు వివిధ రూపాల్లో ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల మద్దతుతో పోరాటం సాగించాలని ఆర్టీసీ కార్మికులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మౌన నిరసన దీక్షకు దిగారు. 8వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో నేడు అన్ని ఆర్టీసీ డిపోల ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ కార్మికులు మౌన నిరసన దీక్షలు చేస్తున్నారు.రోజు రోజుకూ ఆర్టీసీ సమ్మెపై ప్రజా సంఘాల మద్దతు పెరుగుతోంది.
ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు అధిక చార్జీల మోతతో అల్లాడుతున్నారు. బస్సులలో చార్జీల పట్టికలు పెట్టి అధిక చార్జీలు వసూలు చేయకూడదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రయాణికులు నిలువు దోపిడీకి గురవుతున్నా ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చి చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ విభిన్న రూపాల్లో తమ నిరసన తెలియ చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించక ఉంటే మరింత ఉదృతంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టి సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపించే ఆలోచనలో ఉన్నారు. ఇక దీనికోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు సైతం మద్దతు ప్రకటిస్తూ ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలవనున్నారు.