చేయకూడని పనిచేసి.. అడ్డంగా బుక్కైన మహిళా ఆర్టీవో అధికారి!
తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతిగౌడ్ అడ్డంగా బుక్కయ్యారు.
హైదరాబాద్: నగరంలోని తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతిగౌడ్ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ రింగురోడ్డులో ఓ లారీ డ్రైవర్ను బౌన్సర్లతో కొట్టించిన వైనంతో ఆమెపై అధికారులు సీరియస్ అయ్యారు. సాగర్ రింగురోడ్డులో ఆమె ఎందుకు తనిఖీలు చేయాల్సి వచ్చిందంటూ ఆరాతీస్తున్నారు. అసలు ఆర్టీవో అధికారిణికి బౌన్సర్లు ఎందుకున్నారనే విషయంపైనా ఉన్నతాధికారులు దృష్టిసారించారు.
ఆ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పరిధిని దాటి స్వాతిగౌడ్ వ్యవహరించిందని అక్రమ వసూళ్లకు పాల్పడిందని ఉన్నతాధికారులు ఇప్పటికే ఒక నిర్దారణకు వచ్చారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరు ఆమె సోదరుడు కాగా మరొకరు బయట వ్యక్తని అధికారులు గుర్తించారు. డ్రైవర్పై దాడి వ్యవహారమంతా సీసీ కెమెరాల్లో రికార్డవ్వడంతో ఆర్టీవో అధికారిణి స్వాతిగౌడ్ అడ్డంగా బుక్కయ్యారు.
ఇదీ జరిగింది..
ఆదివారం రాత్రి సాగర్ రింగు రోడ్డులో ఓ లారీని ఆపేసిన ఏఎంవీఐ స్వాతిగౌడ్ చలనా రాశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు లారీ డ్రైవర్ శ్రీకాంత్పై ఆమె బౌన్సర్లు దాడిచేశారు. గతంలో తనవద్ద నుంచి నాలుగైదుసార్లు రూ.5 వేల చొప్పున వసూలు చేశారని.. ఈసారి రూ.10 వేలు అడగ్గా తను ఇవ్వలేదని, అందుకే తనపై దాడి చేయించారని డ్రైవర్ శ్రీకాంత్ ఆరోపించాడు. స్వాతిగౌడ్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు, ఆయన కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.
ఆదినుంచీ వివాదస్పదమే...
ఆర్టీవో అధికారిణి స్వాతిగౌడ్ మొదటినుంచి కూడా వివాదస్పదంగా వ్యవహరించేవారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడైనా.. ఎవరైనా తనిఖీలు చేయాలంటే రవాణా శాఖకు చెందిన కానిస్టేబుల్స్, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్, కిందిస్థాయి అధికారులు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈమె మాత్రం తన సోదరుడ్ని, మరో ఇద్దరు ప్రైవేట్ బౌన్సర్లతో తనిఖీలు నిర్వహిస్తుంటారని, ఇష్టమొచ్చినంత డబ్బు అడగడం ఇవ్వకపోతే బౌన్సర్లతో కొట్టించడం ఈ ఆఫీసర్కు షరా మాములేనంటూ ఆరోపణలు వస్తున్నాయి.
ముందుగానే ఫిర్యాదు...
నిన్న జరిగిన ఘటనలో బౌన్సర్లతో దెబ్బలు తిన్న లారీ డ్రైవర్ తీవ్ర గాయాలతో స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేయడానికి వెళితే.. ఇతనికంటే ముందే డ్రైవర్పై స్వాతి గౌడ్ ఫిర్యాదు చేయడం గమనార్హం. పోలీస్ శాఖ, రవాణా శాఖలో తనకున్న పరిచయాలతో ఈ విధంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఈమెపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అధికారిణిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతస్థాయి అధికారులు కూడా రంగం సిద్ధం చేశారు.