అడకత్తెరలో పోకచెక్కలా నిజామాబాద్ రైతుల పరిస్థితి .నామినేషన్ల విత్ డ్రా కు అధికార పార్టీ నేతల ఒత్తిడి
Recommended Video
అడకత్తెరలో పోకచెక్కలా మారింది నిజామాబాద్ లో నామినేషన్లు వేసిన రైతన్నల పరిస్థితి. మార్చి 28 నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో నిజామాబాద్ జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతోంది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని రైతులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ నామినేషన్లు ఉపసంహరించుకోరాదని తీర్మానించారు రైతులు .దీంతో రైతులు నామినేషన్లు ఉపసంహరించుకుంటారా, లేక పోటీలో ఉంటారా అన్నది నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
నిజామాబాద్ లో కవితతో 184 మంది రైతుల వార్ .. బ్యాలెట్ ముద్రణ పై ఆధారపడి ఎన్నిక
బరిలో ఏడుగురు వివిధ పార్టీల అభ్యర్థులు.. మిగతా అంతా రైతులే
నిజామాబాద్ పార్లమెంటు బరిలో 191 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 184 మంది రైతులు ఉన్నారు. టీఆర్ ఎస్ నుండి సిట్టింగ్ ఎంపీ కవిత, బీజేపీ నుండి అరవింద్ , కాంగ్రెస్ నుండి మధు యాష్కీ , జనసేన,పిరమిడ్ , సమాజ్ వాదీ ఫార్వార్డ్ బ్లాక్ , బహుజన విముక్తి పార్టీల నుండి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థుల ఏడుగురు వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కాగా మిగతా వారంతా రైతులే.
రైతుల నామినేషన్ల వల్లే బ్యాలెట్ పోరు
తెలంగాణా రాష్ట్రంలోనే అత్యధికంగా నామినేషన్లు దాఖలైనట్లు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో బ్యాలెట్ పోల్ నిర్వహించాలని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. 191 మంది అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు పోలింగ్ జరగనున్న 11వ తేదీలోపు ముద్రణ సాధ్యమైతే అన్ని జిల్లాలతో పాటుగా నిర్వహించే అవకాశం ఉంది. రైతులు నామినేషన్ దాఖలు చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
నామినేషన్లు ఉపసంహరించుకోవాలని రైతన్నలపై టీఆర్ఎస్ ఒత్తిడి
నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28వ తేదీ చివరి తేదీ కావడంతో, రైతులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని నిజామాబాదు జిల్లాలోని ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. అధికార పార్టీ నేతలు రైతులపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. అయినా రైతులు ససేమిరా అంటున్నారు. తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకు దేనికైనా సిద్ధం అంటున్నారు. బతిమాలో , భయపెట్టో నామినేషన్ల ఉపసంహరణ చేయించాలని అధికార టీఆర్ ఎస్ పార్టీ విఫలయత్నం చేస్తుంది. కానీ రైతులు మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నారు.
నామినేషన్లు విత్ డ్రా చేసుకుంటే లక్ష జరిమానా , గ్రామ బహిష్కరణ
ఈ పరిస్థితిని ముందే గుర్తించి నామినేషన్లు ఎవరు ఉపసంహరించుకో రాదని, ఎవరైనా ఉపసంహరించుకుంటే లక్ష జరిమానా విధిస్తామని రైతులు పోటీ చేస్తున్న గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు తీర్మానం చేశాయి. అంతేకాదు నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిని గ్రామ బహిష్కరణ చేస్తాం అంటూహెచ్చరిస్తున్నాయి .
అడకత్తెరలో పోకచెక్కలా నలుగుతున్న రైతులు ... అనివార్యత దృష్ట్యా పోటీ
ఇక ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి పోటీ నుండి వైదొలగలేక , లక్ష జరిమానా తో పాటుగా, గ్రామ బహిష్కరణ నిర్ణయం నేపథ్యంలో నామినేషన్ ఉపసంహరించుకోలేక రైతన్నలు నలిగిపోతున్నారు. గిట్టుబాటు ధర కోసం, అనివార్య పరిస్థితుల్లో రైతులు పోటీలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది . దీంతో నిజామాబాద్ జిల్లాలో కవిత ఇలాకాలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.