కేసీఆర్ సంచలనం: ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు!, హెచ్చరికలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పార్టీ క్రమశిక్షణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ శాసనమండలి సభ్యుడు ఆర్ భూపతిరెడ్డిని సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గురువారం లేదా శుక్రవారం దీనిపై ఆదేశాలు జారీ చేయనున్నారు.
Recommended Video
సృష్టికర్త! ఘనతంతా చంద్రబాబుదే: కేటీఆర్ షాకింగ్ కామెంట్స్, అమరావతిపైనా..
భూపతిరెడ్డి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనపై ప్రత్యక్షంగా చర్య తీసుకోవడంతో పాటు పార్టీలో దారి తప్పుతున్న మరికొందరు ప్రజాప్రతినిధులకు దీనిద్వారా పరోక్ష హెచ్చరికలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ స్థాయి ప్రజాప్రతినిధిపై వేటుకు సిద్దం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అప్పుడు బుజ్జగించిన సీఎం
ఆర్థోపెడిక్ వైద్యుడైన భూపతిరెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు నుంచి నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయాలనే సంకల్పంతో అక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. చివరికి అధిష్ఠానం ఆ టికెట్ను బాజిరెడ్డి గోవర్ధన్కు ఇచ్చింది. దీంతో భూపతిరెడ్డి అసంతృప్తికి గురికాగా సీఎం ఆయనను బుజ్జగించి, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామి ఇచ్చారు.
కేసీఆర్ మాట నిలబెట్టుకున్నా... కవిత రంగంలోకి దిగినా..
2016లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వగా భూపతిరెడ్డి ఏకగ్రీవంగా గెలిచారు. తర్వాత ఆయనకు, ఎమ్మెల్యే బాజిరెడ్డికి విభేదాలు మొదలయ్యాయి. ఎంపీ కవిత సయోధ్యకు యత్నించినా వీలు కాలేదు. సీఎం హెచ్చరికలు వినడం లేదని గుర్తించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు బుధవారం హైదరాబాద్లో సమావేశమై ఆయనను సస్పెండ్ చేయాలని తీర్మానించారు.
ఆ విషయం తెలిసి సీఎం ఆగ్రహం..
భూపతిరెడ్డి మరో పార్టీలోకి వెళ్లేందుకు రెండు పార్టీల నేతలతో మంతనాలు సాగించారని ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ లేఖ బుధవారం రాత్రి ముఖ్యమంత్రికి చేరిన తర్వాత ఆయన పార్టీ నేతలతో చర్చించారు. ఈ నేపథ్యంలో భూపతిరెడ్డి వైఖరిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
భూపతిరెడ్డిపై వేటుకు..
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆర్ భూపతిరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. ఈ మేరకు వారు ఏకగ్రీవంగా తీర్మానం చేసి, సీఎంకు సిఫార్సు చేశారు.
నేడో రేపో వేటు
బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి నివాసంలో ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీపాటిల్, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, గణేశ్గుప్తా, షకీల్, ప్రశాంత్రెడ్డి, గంపగోవర్ధన్, హన్మంత్షిండే, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి తుల ఉమ, నిజామాబాద్ పార్టీ ఇన్ఛార్జి, మార్క్ఫెడ్ ఛైర్మన్ లోక బాపురెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా నేతల తీర్మానం మేరకు సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటుకు సిద్ధమయ్యారు. ఈ చర్య ద్వారా పార్టీలోని ఇతర నేతలకు కూడా గట్టి హెచ్చరిక ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.