మోడీ విస్తరణ వేళ కెసిఆర్ ఢిల్లీ టూర్పై పుకార్లు: దత్తాత్రేయకు రెండు ఆప్షన్లు
ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటనపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటనపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మూడు రోజుల పర్యటన కోసం ఆయన ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు.
శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో రాజకీయ విశేషాలేమీ లేవని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్గాలు అంటున్నాయి.
కానీ, ఎన్డిఎలోకి కొత్త భాగస్వాములను ఆహ్వానిస్తూ వారికి కూడా మంత్రి పదవులు ఇవ్వడానికి మోడీ సిద్ధపడినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కెసిఆర్ ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఉందని అంటున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి పదవికి బండారు దత్తాత్రేయ రాజీనామా చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
కంటి పరీక్షల కోసమేనా..
కెసిఆర్ ఆ మధ్య ఢిల్లీ వెళ్లినప్పుడు కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటికి శస్త్రచికిత్స అవసరమవుతుందని, కొంత కాలం తర్వాత దాన్ని చేద్దామని ఢిల్లీలో వైద్యులు కెసిఆర్కు చెప్పారని అంటున్నారు. ఆ నేపథ్యంలో మరోసారి కంటి పరీక్ష నిమిత్తం ఆయన ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. అదే సమయంలో ఆయన మోడీని కూడా కలుస్తారని, కేంద్ర వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగులో ఉన్న అంశాలపై మాట్లాడుతారని అంటున్నారు. అయితే, విషయం అంత మాత్రమే లేదనే ప్రచారం మాత్రం సాగుతోంది.
ఎన్డిఎ కూటమిలో చేరుతుందా...
ఎన్డీఎ కూటమిలో చేరాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుపై ఢిల్లీ బిజెపి అగ్ర నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై బిజెపి పెద్దలతో చర్చలు జరపడానికి కెసిఆర్ ఢిల్లీ వెళ్లి ఉంటారని అంటున్నారు. నిజానికి, తెరాస చాలా వరకు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తోంది.
కవితకు మంత్రి పదవి....
కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి ఇవ్వడానికి బిజెపి అగ్రనేతలు సముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. తెరాస బిజెపికి దగ్గర కావడంలో కవిత పాత్ర చాలా ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఒకవేళ కెసిఆర్ ఎన్డీఎ కూటమిలో చేరని పక్షంలో తెరాస ఎంపీలను లాక్కుంటామని, వారిలోంచి ఒకరికో, ఇద్దరికో మంత్రి పదవులు ఇస్తామని బిజెపి నేతలు అంటున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. ఇదే సమయంలో తెరాసలో కొంత మంది ఎంపీలు బిజెపిలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి.
మురళీధర్ రావుకు మంత్రి పదవి ఇస్తే..
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన మురళీధర్ రావుకు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి తెరాస కోటలను బద్దలు కొట్టాలనే వ్యూహం కూడా బిజెపికి ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల స్థానికంగా జరిగిన సంఘటనలు ఉత్తర తెలంగాణ జిల్లాలో తెరాసకు వ్యతిరేకంగా జరిగాయి. మురళీధర్ రావు సామాజిక వర్గం నేపథ్యం దృష్ట్యా కూడా తెరాసకు కళ్లెం వేయడానికి వీలవుతుందని అంటున్నారు. అది జరగకుండా చూసే ఆలోచన కూడా కెసిఆర్కు ఉండవచ్చునని అంటున్నారు. అయితే, దానికి కెసిఆర్ బెదురుతారా అనేవాళ్లు కూడా ఉన్నారు.
కిషన్ రెడ్డికీ చాన్స్...
శుక్రవారం సాయంత్రం అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తెలంగాణ నుంచి మురళీధర్ రావును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుండగా, హైదరాబాదుకు చెందిన కిషన్ రెడ్డికి కూడా చాన్సు ఉన్నట్లు చెబుతున్నారు. దత్తాత్రేయ రాజీనామా ఈ మార్పు కోసమే జరిగినట్లు చెబుతున్నారు
గవర్నర్గా దత్తాత్రేయ...
ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తామని బండారు దత్తాత్రేయకు బిజెపి అధినాయకత్వం హామీ ఇచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గవర్నర్గా వెళ్లాల్సి వస్తే దత్తాత్రేయ తన సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు సికింద్రాబాదుకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఈ స్థితిలో కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆరు నెలల్లోగా సికింద్రాబాదుకు ఉప ఎన్నికల వచ్చేలా చూడాలని బిజెపి అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి మోడీ, అమిత్ షా కేసిఆర్ మద్దతు కోరుతారని, ఈ చర్చల కోసమే కెసిఆర్ ఢల్లీ వెళ్లారని అంటున్నారు. మురళీధర్ రావుకు మంత్రి పదవి ఇచ్చినా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని బిజెపి అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
దీర్ఘకాలిక సేవలకు గుర్తింపుగా...
దీర్ఘకాలిక సేవలకు గుర్తింపుగా బండారు దత్తాత్రేయను తగిన విధంగా గౌరవించాలనే ఉద్దేశంతో బిజెపి నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దత్తాత్రేయకు ఇప్పుడు దాదాపు 70 ఏళ్ల వయస్సు. నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. వాజ్పేయి ప్రభుత్వంలోనూ మంత్రి పదవులు కూడా చేపట్టారు. 1947 జూన్ 12వ తేదీన జన్మించిన దత్తాత్రేయ 1965లో ఆర్ఎస్ఎస్ల చేరారు. 1968, 1989 మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పనిచేశారు.
ఒక వేళ అలా అయితే...
బండారు దత్తాత్రేయకు క్యాబినెట్ హోదాతో ప్రమోషన్ ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. అప్పుడు సికింద్రాబాదుకు ఉప ఎన్నిక జరగదు. ఒకవేళ ఆయన చేత సికింద్రాబాదుకు రాజీనామా చేయించకపోతే 2019 ఎన్నికలు ముగిసే వరకు ఆయన గవర్నర్ పదవి కోసం నిరీక్షించాల్సి వస్తుంది. అంత దీర్ఘకాలం ఆయనను నిరీక్షణలో పెడుతారా అనేది సందేహమే.
ఆ తర్వాతే క్లారిటీ....
ఆదివారం పది గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారు. ఆ రకంగా మోడీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ముగుస్తుంది. ఇది జరిగిన తర్వాతనే ఏదైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, కెసిఆర్ మజ్లీస్తో స్నేహం కొనసాగించాలని అనుకుంటున్నారు. తమది కేంద్ర ప్రభుత్వానికి ఇష్యూ బేస్డ్ సపోర్టు అని, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, అందువల్లనే రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి మద్దతు ఇచ్చామని ఇటీవల కెసిఆర్ చెప్పారు. అందువల్ల బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ఆయన సిద్ధపడుతారా అనేది సందేహమే. సన్నిహిత మిత్రుడిగా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తారా అనేది కూడా ఆదివారం తేలిపోవచ్చు లేదా దోబూచలాట ఇంకా కొంత కాలం సాగవచ్చు.