ఆ రెండే ఢిల్లీ అల్లర్లకు ఆజ్యం పోశాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఢిల్లీలో ఇటీవల చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ఏర్పాటు చేసిన 'ఐడియాస్ ఫర్ ఇండియా-2020' ఐఎస్బీ పాలసీ కాంక్లేవ్ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్న భారత్ వైపు ప్రపంచం మొత్తం చూస్తోందని అన్నారు.
కొత్త ఒరవడికి నాంది..
నేటి యువతరం కొత్త ఒరవడులకు నాంది పలకాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. దేశం సామాజికంగా, ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలనే విషయంలో ఐడియాస్ కాంక్లేవ్ ఉపయోగపడుతుందని అన్నారు. గడిచిన ఆరేళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక గొప్ప నిర్ణయాలు తీసుున్నారని చెప్పారు. నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్టికల్ 370 వంటి సాహసోపేత నిర్ణయాలే గాక, జన్ధన్ వంటి ఆర్థిక సమానతలకు దారితీసే నిర్ణయాలు కూడా తీసుకున్నారని చెప్పారు. కేంద్ర పథకాలను విద్యార్థులు, యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఆ రెండింటి వల్లే ఢిల్లీ అల్లర్లు..
ఢిల్లీ అల్లర్లపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. సోషల్ మీడియాల్లో అసత్య ప్రచారాలే ఢిల్లీ అల్లర్లకు కారణమని అన్నారు. రాజకీయ పార్టీలలు రెచ్చగొట్టే దోరణి కూడా అల్లర్లకు కారణమవుతున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోర్టు ఢిల్లీలో కపిల్ మిశ్రా సహా బీజేపీ నేతల విద్వేష ప్రసంగాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాగా, ఢిల్లీ ఘటనలో పోలీసు అధికారులను కూడా ఆందోళనకారులు కిరాతకంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.
సీఏఏపై మరోసారి స్పష్టం చేసిన కేంద్రమంత్రి
పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఎక్కువయ్యాయని, ఢిల్లీ విధ్వంసానికి కూడా వారే కారణమని అన్నారు. ఢిల్లీ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేపడుతోందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనేది ఏ భారతీయుడీ పౌరసత్వాన్ని తొలగించదని స్పష్టం చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో అణచివేతకు, వివక్షతకు గురైన మైనార్టీలైన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, తదితరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు మాత్రమేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఘర్షణలో 42 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు పోలీసులను కూడా ఆందోళనకారులు దారుణంగా హత్య చేశారు.