ఖమ్మంపై గంపెడు ఆశలు పెట్టుకున్న రేణుక..!పార్లమెంట్ లో అడుగుపెట్టేది నేనే అంటున్నమాజీ ఎంపి..!!
ఖమ్మం/హైదరాబాద్ : ఖమ్మం రాజకీయాలను అంచనా వేయటం కాదు పసిగట్టడం కూడా కష్టంగా మారాయి. ఖమ్మం ఓటరు ఎవర్ని నెత్తిన కూర్చోబెట్టుకుంటారు, ఎవర్ని తొక్కేస్తారో చెప్పటం కూడా కష్టంగా మారింది. ఇప్పుడు అక్కడ జరిగే లోక్సభ ఎన్నికల్లో పోటీపడుతున్న ఇద్దరూ రాజకీయంగా హేమాహేమీలే..! పైగా అపార రాజకీయ అనుభవం ఉన్న నేతలు. ఇద్దరికీ ఖమ్మంతో ఎంతో సాన్నిహిత్యం.. ప్రజలతో సంబంధాలున్నాయి. సామాజికంగా.. ఆర్ధికంగా కూడా బల ప్రదర్శన చేయగల సమర్థులు. ఆ ఇద్దరే నామా నాగేశ్వరరావు, రేణుకాచౌదరి. ముచ్చటగా మూడోసారి ఎన్నికల బరిలో తలబడబోతున్నారు.
ఖమ్మం ప్రజలు కనికరిస్తారు..! కాంగ్రెస్ గెలుస్తుందంటున్న రేణుక..!!
గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీచేసిన నామా నాగేశ్వర రావు, రేణుకా చౌదరి ఇద్దరు చేరోసారి గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్ధిగా రేణుకాచౌదరి, గులాబీ పార్టీ తరపున నామా నాగేశ్వరరావుకు అక్కడ గెలుపు ను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. పార్టీ మారిన నామా ఇప్పుడు అక్కడ గెలిచితీరాలి. ఎందుకంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనకు ఇచ్చిన రాజకీయ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో నామా ఉన్నారు.
నామా వర్సెస్ రేణుక..!ఈ సారి గెలుపు ఎవరిదో..!!
రేణుకాచౌదరి కూడా పంతం పట్టి మరీ సీటు సాధించుకున్నారు. ఖమ్మం ఎంపి టికెట్ కోసం ఓ చిన్నపాటి యుద్దం చేయాల్సివచ్చింది. ఇప్పుడు ఆమె ఏ మాత్రం తడబడినా ఇక మాజీగానే ఉండిపోవాల్సిన దుస్థితి. ఇటువంటి సమయంలో కాంగ్రెస్కు జాతీయస్థాయిలో పెరుగుతున్న ఇమేజ్. రాహుల్ చరిష్మాను నమ్ముకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆమెకు మద్దతు లభించటంతో గెలుపు ఖాయమనే ధీమాను రేణుక వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్ హవా తగ్గిందంటున్న రేణుక..! పార్లమెంట్ లో అడుగుపెడతానంటున్న ఫైర్ బ్రాండ్..!!
నామా నాగేశ్వరావును గెలిపించే బాధ్యతను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భుజాన కెత్తుకున్నారు. అయినా.. రేణుకాచౌదరి మాత్రం ఈ సారి విజయం పై భరోసా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై ఖమ్మం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కలసి వస్తుందంటున్నారు. శాసన సభ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గెలుపుపై ఎవరి ధీమా వారిదే.! ఖమ్మం ప్రజలపై తీర్పు పై ఉత్కంఠ..!!
మదిరలో గెలిచిన భట్టివిక్రమార్క , తాజాగా ఎమ్మెల్సీ గెలుచుకున్న జీవనరెడ్డి వంటి అంశాలు.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనేందుకు నిదర్శనంగా చెబుతున్నారు. దీని ఆధారంగానే రేపే ఖమ్మం లోక్ సభ నుంచి గెలిచి పార్లమెంట్ లో అడుగు పెడతానంటున్నారు రేణుకా చౌదరి. మరి దేశ వ్యాప్తంగా కంగ్రెస్ హవా కొనసాగి రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి ఐతే రేణుకమ్మ కేంద్రమంత్రిగా పనిచేస్తారన్న మాట..!