డబ్బులొచ్చాయని 'రైతుబంధు' మేసేజ్.. బ్యాంకుకు వెళ్తే 'పైసలు' రాలే..! ఎన్నికల స్టంటా?
హైదరాబాద్ : రైతుబంధు (యాసంగి) పథకం ద్వారా రూపాయలు ***** మీ **** ఖాతా నం *********** నందు జమ చేయబడింది - వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. ఇది ముందస్తు ఎన్నికల వేళ కొందరి ఫోన్ నెంబర్లకు వచ్చిన మేసేజ్. అయితే డబ్బులొచ్చాయన్న ఆనందంతో బ్యాంకుకు వెళ్లిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. ఎందుకిలా జరిగింది. అసలేం జరిగింది?
రైతుబంధం పథకం ఎన్నికల స్టంట్ గా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొందరి ఫోన్లలో మేసేజ్ సౌండ్ మోగింది. ఏంటని ఆ సందేశం చదివితే మీ ఫలానా బ్యాంకు ఖాతాలో ఇంత ఎమౌంట్ క్రెడిట్ అయిందనేది దాని సారాంశం. ఇలా ఒక్కరికి కాదు రాష్ట్రవ్యాప్తంగా చాలామందికి ఇలాంటి మేసేజ్ వచ్చింది.
గోల్మాల్ యవ్వారమేనా?
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీపై విపక్ష నేతలు భగ్గుమన్నారు. ఎలక్షన్లలో గోల్మాల్ జరుగుతోందంటూ ఆరోపించారు. తీరా ఎన్నికలైన తర్వాత కూడా ఈవీఎం లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అదలావుంటే తాజాగా వెలుగులోకి వచ్చిన రైతుబంధం వ్యవహారం విస్మయం కలిగిస్తోంది. పోలింగ్ కు ముందురోజుల్లో రైతుబంధు పథకం కింద మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమచేశామనే సందేశం లబ్ధిదారులకు పంపించింది వ్యవసాయ శాఖ. తీరా బ్యాంకులకు వెళ్లిన లబ్ధిదారులకు చుక్కెదురైనట్లు సమాచారం. ఖాతాల్లోకి అసలు డబ్బులే రాలేదని తెలుస్తోంది.
ప్రీ ప్లానా? నిధులు లేవా?
ఎన్నికలకు ముందు ఇలాంటి మేసేజ్ పంపించడం వెనుక టీఆర్ఎస్ స్ట్రాటజీ ఉపయోగించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఓట్ల కోసం రైతుబంధం పథకం వాడుకుందనే ఆరోపణలొస్తున్నాయి. కేవలం ఓటర్లను ఆకర్షించడానికి ఇలాంటి సంక్షిప్త సందేశాలు పంపించిందంటున్నారు లబ్ధిదారులు. మరోవైపు ఎన్నికలు అయిపోయాక కూడా చాలామందికి ఇలాంటి మేసేజ్ లే వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా చాలామందికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకాకపోవడం గమనార్హం. అదలావుంటే దీనివెనుక సాంకేతిక సమస్యలున్నాయా, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయ లోపమా లేదంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకపోవడమా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఎన్నికల కోడ్ ఏమైంది?
రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పథకం మేసేజ్ వచ్చినవారి ఖాతాల్లోకి పైసలు రాకపోవడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఈమేరకు లబ్ధిదారులు ఏ నలుగురు కలిసినా.. ఇదే అంశం చర్చకు వస్తోంది. నాకు మేసేజ్ వచ్చింది గానీ డబ్బులు రాలే అని ఒకరంటే.. ఆ మేసేజ్ చూసి బ్యాంకుల చుట్టూ తిరిగామంటున్నారు ఇంకొందరు. ఇదంతా ఎన్నికల డ్రామా అంటున్నారు మరికొందరు. మొత్తానికి ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నిబంధనలు ఉల్లంఘించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.