సబిత రాజీనామా చేయాలన్న భట్టి..! మోసం చేసిందంటూ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు..!!
హైదరాబాద్ :ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలకు పదును పెంచారు కాంగ్రెస్ నేతలు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం ఉన్నా, ఎమ్మెల్యే సబితారెడ్డి పదవికి రాజీనామా చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో చేపట్టారు. అనంతరం జిల్లెలగూడలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో దశాబ్దకాలం పాటు సబితారెడ్డి పదవులు అనుభవించారని గుర్తుచేశారు. నియోజకవర్గం మారినా టికెట్ ఇచ్చి గెలిపించగా.. ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరడం సిగ్గుచేటన్నారు.
ఆమె సభ్యత్వాన్ని స్పీకరే రద్దు చేయాలి..! సబిత పై న్యాయపోరాటానికి సిద్దమన్న భట్టి..!!
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తిగా సబితారెడ్డి మిగిలిపోతారన్నారు. రాజీనామా చేయకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. శాసనసభ సభ్యత్వం రద్దు చేసే విధంగా స్పీకర్పై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. సభాపతి స్పందించకుంటే.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆమెపై 420, 405, 408 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ గుర్తుతో పోటీ చేసి, ఆ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు గౌరవప్రదమైన చట్టసభల్లో కూర్చునే అర్హత లేదని అన్నారు.
సబిత స్వచ్చందాగా రాజీనామా చేయాలి..! డిమాండ్ చేస్తున్న టీపిసిసి..!!
చట్ట సభలను అగౌరవపరుస్తున్న శాసనసభ్యులకు ప్రజలే తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఒక పార్టీ గుర్తుతో పోటీ చేసి గెలిచిన అభ్యర్థి పదవీకాలం ముగిసేదాకా అదే గుర్తుతో ఎమ్మెల్యేగా కొనసాగాలని చట్టం చెబుతోందని, కానీ దురదృష్టవశాత్తూ తెలంగాణలో చట్టాలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్కుమార్, కొండా విశ్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యే సబితారెడ్డి ద్రోహం చేశారంటూ చైతన్యపురి పోలీస్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. 405, 406, 420 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలని కోరారు.
కేసీఆర్ ది నియంతృత్వం..! జగ్గారెడ్డి పార్టీని వీడుతారనుకోవడంలేదన్న విక్రమార్క...!!
రాష్ట్రంలో సీఎం చంద్రశేఖర్ రావు నియంతలా వ్యవహరిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు.మోసగాళ్లు చట్టసభల్లో కూర్చుంటే.. మోసపూరిత చట్టాలే వస్తాయే తప్ప ప్రజలకు మేలు చేసేవి రావని భట్టి అన్నారు. వేల మందిని మోసం చేసి పార్టీ మారిన మోసగాళ్లపై ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల చేసిన భిన్న ప్రకటనలను విలేకరులు భట్టి దృష్టికి తీసుకెళ్లగా.. జగ్గారెడ్డి పార్టీ మారుతారని తాను అనుకోవడం లేద ని చెప్పారు.
సబితా ఇంద్రారెడ్డిపై ఫిర్యాదు..! నమ్మిన కార్యకర్తలను మోసం చేసిందంటూ ఫైర్..!!
మహేశ్వరం ఎమ్మెల్యేగా ఎన్నికైన సబితా ఇంద్రారెడ్డి తర్వాత నమ్మి గెలిపిం చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను మోసం చేసి పార్టీ ఫిరాయించారని ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసిన సబితా ఇంద్రారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ చంగారెడ్డితోపాటు మరో 60 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం సాయంత్రం చైతన్యపురి పోలీస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నా మని ఇన్స్పెక్టర్ సుదర్శన్ వెల్లడించారు.