సబితా ఇంద్రారెడ్డి మళ్లీ యాక్టివ్: కేటీఆర్పై ఫైర్
హైదరాబాద్: చాలా రోజుల తర్వాత మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాలో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్.. మాజీ హోంమంత్రి సబితారెడ్డిపై చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు.
తమ కుటుంబం 30 ఏళ్లుగా నిస్వార్ధంగా ప్రజాసేవ చేస్తోందని, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సాక్ష్యాలేమైనా కేటీఆర్ దగ్గర ఉంటే కోర్టులో సమర్పించాలని డిమాండ్ చేశారు. "అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు బ్రదర్. అర్థంపర్థంలేకుండా వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలుచేస్తే ఊరుకునేదిలేదు." అంటూ కేటీఆర్పై విరుచుకుపడ్డారు.
వ్యక్తిగత ప్రతిష్టకుపోయి మాజీ మంత్రి డాక్టర్ రాజయ్యను బకరాను చేశారని సబితారెడ్డి విమర్శించారు. రాజయ్య విషయంలో ఏ అవినీతి జరిగిందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ప్రజల పక్షాన ఉండి మీ తప్పులను చూపితే వాటిపై స్పందించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం ఏమిటని ప్రశ్నించారు.