కాంగ్రెస్కు భారీ షాక్: తెరాసలోకి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, మధ్యవర్తి అసదుద్దీన్!
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. తాజాగా, ఆ పార్టీకి చెందిన కీలక నేత అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డిలు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ వీరు పార్టీ మారడానికి మధ్యవర్తిత్వం వహించినట్లుగా తెలుస్తోంది. మూడ్రోజుల క్రితం సబిత, కార్తిక్లు అసదుద్దీన్తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పలు అంశాలపై చర్చించారని సమాచారం. తెరాసలో చేరే అంశంపై వారితో అసద్ మాట్లాడారని తెలుస్తోంది.
తాజాగా, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోను భేటీ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో వారు కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరనున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల సబితా ఇంద్రా రెడ్డి, కార్తీక్ రెడ్డిలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శనివారం జరిగిన రాహుల్ గాంధీ సభలో కనీసం తమను పరిచయం చేయలేదని కార్తీక్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.
ఐటీ గ్రిడ్ చంద్రబాబుదే, ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాదుకే ఏపీ సీఎం: తలసాని
రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకుల్లో సబితా ఇంద్రారెడ్డి కీలకమైన నేత. వికారాబాద్ జిల్లా కోటబాస్పల్లి గ్రామంలో 1963, మే 5న జన్మించారు. భర్త, మాజీ మంత్రి ఇంద్రారెడ్డి మరణంలో జరిగిన ఉపఎన్నికలలో 2000లో కాంగ్రెస్ తరఫున తొలిసారిగా చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. అనంతరం చేవెళ్ళ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నారు.
2004లో చేవెళ్ళ నుంచి గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చేవెళ్ళను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దీంతో 2009 మహేశ్వరం నుంచి పోటీ చేసి గెలిచారు. 2004-09 కాలంలో గనుల శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 వైయస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో కీలక హోంశాఖ బాధ్యతలు చేపట్టారు. హోంశాఖ మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారు.