పదవుల కోసం ప్రయత్నాలు: సబితను కలిసిన రేవంత్, టీడీపీ నుంచి నేతల జంప్
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులను వరుసగా కలుస్తున్నారు.
హైదరాబాద్: ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులను వరుసగా కలుస్తున్నారు. శనివారం రేణుకా చౌదరిని కలిసిన రేవంత్.. ఆదివారం మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో భేటీ అయ్యారు.
అది బలుపు: రేవంత్ దుమ్ముదులిపిన కొండా సురేఖ
Recommended Video
సబితా ఇంద్రా రెడ్డితో రేవంత్
ఆయన సబితా ఇంద్రా రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనకు సబితా, ఆయన తనయుడు కార్తీక్ రెడ్డి స్వాగతం పలికారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఆ తర్వాత ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరి మద్దతును కూడగట్టే ప్రయత్నంలో రేవంత్ ఉన్న విషయం తెలిసిందే.
రేవంత్ సమక్షంలో రంగారెడ్డి జిల్లా టీడీపీ నాయకులు
తెలంగాణ టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు కొందరు రేవంత్, సబితా ఇంద్రారెడ్డిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
రేవంత్ టీంకు ప్రాధాన్యత
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఏ పదవి ఆశిస్తున్నారనే విషయమై అధిష్టానానికి జాబితా చేరిందని తెలుస్తోంది. రాహుల్ గాంధీ వరంగల్ సభ అనంతరం రేవంత్ టీంకు ప్రాధాన్యత దక్కవచ్చునని అంటున్నారు. అందులో భాగంగానే ఆయన పార్టీలోని సీనియర్లను కలిసి మద్దతు కూడగట్టుకుంటున్నారని అంటున్నారు.
రేవంత్ టీంలో ఎవరెవరికి?
రాహుల్ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగానే మిగతా టీం కొలువు తీరబోతోంది. వాస్తవానికి ఈపాటికే రాహుల్ పగ్గాలు చేపట్టాల్సి ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం, వ్యూహాలలో బిజీగా ఉండడంతో ఆలస్యం అవుతోంది. ఆ ఎన్నికలు అనంతరం రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ టీంలో రాష్ట్రం నుంచి రేవంత్తో పాటు కాంగ్రెస్లో చేరిన ఇరవై మందిలో ఎవరికి ప్రాధాన్యత దక్కుతుందనే చర్చ సాగుతోంది.
పదవుల కోసం ప్రయత్నాలు
ఈనెల 19 లేదా 20 తేదీల్లో వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో దళిత, గిరిజన, బీసీ గర్జన పేరుతో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్ హాజరవుతున్నారు. ఈ సభ తర్వాత డిసెంబర్ మొదటి వారంలో టీపీసీసీ ప్రక్షాళన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాహుల్ పగ్గాలు చేపట్టిన తర్వాత అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల నియామకం జరుగుతుంది. ఆ తర్వాత డీసీసీ బ్లాక్ స్థాయి వరకు అధ్యక్షుల నియామకాలు చేపడతారు. రాష్ట్రం రాహుల్ టీంలో సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఒకరికి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఒకరికి, కార్యదర్శులుగా ఇద్దరికి చోటు దక్కబోతోంది. వాటి కోసం నేతలు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది.