రచ్చ: టీడీపీకి ఎవరితో ఓట్లేయించుకుంటారో చూస్తా.. కాంగ్రెస్ పార్టీకి షాక్, సబిత కొడుకు రాజీనామా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి భారీ షాకిచ్చారు. గురువారం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తాను కోరుకున్న స్థానంలో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోడవంపై ఆయన అల్టిమేటం జారీ చేశారు. తనకు రాజేంద్రనగర్ సీటును కేటాయిస్తారా లేక తన రాజీనామాను ఆమోదిస్తారా చెప్పాలని డిమాండ్ చేశారు.
నాకు మంత్రి పదవే ఎక్కువ: సీఎం పదవిపై కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను రాజీనామా చేస్తే రాజేంద్రనగర్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఎవరితో ఓట్లు వేసి గెలిపిస్తారో గెలిపించుకోండని చెప్పారు.
కార్తీక్ రెడ్డి రెబల్గా పోటీ చేస్తారా?
మహాకూటమి పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ స్థానం తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తా పోటీ చేయనున్నారు. ఈ సీటును కార్తీక్ రెడ్డి ఆశించారు. కానీ ఆయనకు రాకపోవడంతో గురువారం తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు అల్టిమేటం జారీ చేశారు. ఆయన రెబల్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కార్తీక్ రెడ్డి తల్లి సబితా ఇంద్రా రెడ్డి మహేశ్వరం నుంచి పోటీ చేస్తునన్నారు. గత ఎన్నికల్లో కార్తీక్ చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగి తెరాస అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఒకే కుటుంబం నుంచి కోమటిరెడ్డి సోదరులు, మల్లు సోదరులకు టిక్కెట్లు వచ్చాయి.
బండ్ల గణేష్ కూడా ఆశించారు, కానీ షాకిచ్చిన కాంగ్రెస్
మరోవైపు, ఇదే రాజేంద్రనగర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రముఖ సినిమా నటుడు బండ్ల గణేష్ కూడా టిక్కెట్ ఆశించారు. దీని కోసం ఆయన కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కూడా కలిశారు. కానీ ఆయనకు కూడా టిక్కెట్ రాలేదు. టీడీపీకి టిక్కెట్ కేటాయించడం ద్వారా ఆయనకు కూడా షాకిచ్చింది అధిష్టానం.
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్
భిక్షపతి యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్యాయం చేశారని మండిపడ్డారు. తమ సత్తా ఏమిటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామన్నారు. 17వ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని చెప్పారు.
రాహుల్ గాంధీతో భేటీ
ఇదిలా ఉండగా, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలు భేటీ కానున్నారు. ఏడు స్థానాలు పెండింగులో ఉన్నాయి. వీటిపై చర్చించనున్నారు. ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావహులకు పిలుపు వచ్చింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ముగ్గురు ఆశావహులు, రేపు ఉదయం ఏడు గంటలకు నలుగురు నేతలు కలవనున్నారు.