సబితకు టీఆర్ఎస్ ప్రభుత్వం షాక్: గన్ మెన్ల ఉపసంహరణ, ఆగ్రహం
హైదరాబాద్: మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి గన్మెన్లను ఉపసంహరిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ హోంమంత్రి హోదాలో ఆమెకు ఏర్పాటు చేసిన భద్రతను కొనసాగించలేమని ఆమెకు రాసిన ఓ లేఖలో ప్రభుత్వం తేల్చిచెప్పింది. 2009 నుంచి 2014వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన సబితకు ప్రభుత్వం భద్రతను కొనసాగిస్తూ వచ్చింది.
ఇప్పటి వరకు ఆమెకు ఇద్దరు గన్ మెన్లు ఉన్నారు. అయితే ఇటీవల ఆమెకు గన్ మెన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆ లేఖలో ప్రభుత్వం సబితకు వెల్లడించింది. ఐదురోజుల క్రితం భద్రత ఉపసంహరణ లేఖ సబితకు అందినప్పటికీ దానిపై ఆమె సంతకం చేయలేదు. దీంతో ప్రస్తుతం ఆమెకు ఇంకా గన్ మెన్ల భద్రత కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయంపై సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ మెన్ల ఉపసంహరణ విషమయై కోర్టుకి వెళ్లే యోచనలో సబితా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఈ అంశంపై తీవ్రస్థాయిలో మండిపడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.
కాగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి హోం మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి, తెలుగు నేలలో తొలి మహిళా హోంశాఖ మంత్రిగా రికార్డు పుటల్లోకి ఎక్కారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత కూడా ఆమె హోం శాఖ మంత్రిగానే పదవీ బాధ్యతలు నిర్వర్తించారు.
అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పార్టీకి వీచిన ఎదురుగాలి నేపథ్యంలో ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది.