టీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్తున్నానంటే?: సబిత ఇంద్రారెడ్డి, సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఆగ్రహం
హైదరాబాద్: గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పైన గెలిచిన మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెరాసలో చేరేందుకు సిద్ధమయ్యారు. తన కొడుకు కార్తీక్ రెడ్డితో కలిసి త్వరలో చేవెళ్లలో జరగనున్న కేసీఆర్ బహిరంగ సభలో కారు ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి ఎందుకు వచ్చాననే విషయాన్ని ఆమె వెల్లడించారు.
తెలంగాణ నుంచి రూ.లక్షకోట్లు రావాలి: బాబు సంచలనం, లోకసభ ఎన్నికల్లో పోటీపై ఏమన్నారంటే
అందుకే తెరాసలో చేరుతున్నా
తన మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని చెప్పారు. తనకు గుర్తింపు రావడానికి కారణమైన కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని ఆమె చెప్పడం గమనార్హం. ఇన్నాళ్లు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు ప్రాంతీయ పార్టీ వల్లే అభివృద్ధి అని చెప్పడం గమనార్హం.
ఇంద్రారెడ్డి కూడా ప్రాంతీయ పార్టీలో పని చేశారు
తన భర్త ఇంద్రారెడ్డి కూడా ప్రాంతీయ పార్టీలో పని చేశారని ఈ సందర్భంగా సబితా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఈ పరిస్థితిల్లో ఉండటానికి వైయస్ రాజశేఖర రెడ్డి కారణమని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండడానికి తాను కారణమని ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సబిత వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాష్ట్రం ఇలా అభివృద్ధిలో ఉండటానికి వైయస్ కారణమన్నారు.
తెరాసను గెలిపించుకుంటాం
తమ జిల్లాలో అందరం కలిసి లోకసభ ఎన్నికల్లో తెరాసను గెలిపించుకుంటామని సబిత చెప్పారు. ఎన్నికలు ఏవి అయినా తెరాసదే విజయం కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. రంగారెడ్డి ఎంతో అభివృద్ధి చెందిందని అనుకుంటున్నప్పటికీ సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. రంగారెడ్డి అభివృద్ధిపై దృష్టి సారిస్తామని చెప్పారు. వికారాబాద్ను ఒక ఊటీలా చేయాలన్నారు. లోకసభ ఎన్నికల్లో తెరాసను 16 స్థానాల్లో గెలిపించాలన్నారు.
సబితపై కాంగ్రెస్ నేతల నిప్పులు
పార్టీ మారుతున్న సబితపై కాంగ్రెస నేతలు నిప్పులు చెరిగారు. పార్టీలో అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు తెరాసలోకి వెళ్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆమె వెంట వెళ్లవద్దన్నారు. ఇంద్రారెడ్డి ఆశయాల కోసం అయితే తెలంగాణ సమయంలో పార్టీ మారాల్సి ఉండెనని చెప్పారు. సబిత మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.