టిఆర్ఎస్ది కరెక్టే: సదానంద గౌడ, ఏపీకి ప్రత్యేక హోదాపై కొత్త ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండు సరైందేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ ఆదివారం నాడు చెప్పారు. హైదరాబాదులోని నల్సార్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర పట్టాలను ప్రదానం చేసేందుకు సదానంద వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి హైకోర్టు విభజన అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం తాను ఏమీ మాట్లాడబోనని చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలని టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించారని చెప్పారు. వారి డిమాండ్ సరైనదే అన్నారు.
హైకోర్టును విభజించాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పరిశీలిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం కట్టుబడి ఉందని సదానంద గౌడ చెప్పారు.
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా అర్హతలు లేవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రం సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేక కొలమానాల అధారంగా ప్రణాళిక సంఘం హోదా ఇస్తుందని, ఏపీ వాటిల్లోని ఏ కొలమానం పరిధిలోకి రాదని కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. సదానంత మాత్రం కట్టుబడి ఉన్నామని చెప్పడం గమనార్హం.
గత ప్రభుత్వాలు పేదల గురించి పట్టించుకోలేదు: ఈటెల
గత ప్రభుత్వాలు పేదల గురించి వారి వైద్యం గురించి పట్టించుకోలేదని మంత్రి ఈటెల రాజేందర్ వేరుగా ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఆయన పర్యటించారు. పేదలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్, ఆపీ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ప్రశంసించారు.