ఏకే 47తో కాల్పులు, కుగ్రామంలో ఫైరింగ్, పరారీలో నిందితుడు, మావోయిస్టులతో సంబంధాలు..?
ఇటుకల కోసం మొదలైన గొడవ ఏకే-47 తీసుకొచ్చేవరకు వెళ్లింది. కోపోద్రిక్తుడైన వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన సదానందం గురించి ఆరాతీస్తున్నారు.
ఏకే-47
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో సదానందం, గంగరాజు పక్క పక్కనే ఇల్లు. వారిద్దరూ దూరపు చుట్టాలు కూడా. ఇటీవల గంగరాజు తల్లితో సదానందానికి గొడవ జరిగింది. ఇంటి పక్కన గల ఇటుకల విషయంలో ఘర్షణ పడ్డారు. ఇంటి పక్కన గోడ పెట్టాలని కూడా గొడవ జరిగింది. వారి మధ్య ఘర్షణ ఏకే-47 తీసుకొని రావడం కలకలం రేపింది.
రాత్రి 9 గంటల సమయంలో..
మాట మాట పెరిగిన క్రమంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో సదానందం తన వద్ద ఉన్న ఏకే 47 తీసుకొచ్చాడు. అంతకుముందే ఇంట్లో ఒకసారి ఫైర్ చేశాడు. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. తర్వాత గంగరాజుపై కాల్పులు జరపడంతో తృటిలో తప్పించుకున్నారు. తర్వాత తుపాకీ తీసుకొని సదానందం పారిపోయాడు. కానీ గ్రామంలో మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకీ ఉండటం అరుదు అయితే.. ఏకే 47 ఎక్కడిది అని ఆందోళన చెందుతున్నారు.
గన్ ఎక్కడిదీ..?
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరాతీశారు. రెండు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సదానందానికి ఏకే 47 ఎక్కడినుంచి వచ్చిందని సదానందం కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఇంట్లో కాల్పులు జరిపి.. ఓకే అనుకొన్నాక.. బయటకొచ్చి ఫైరింగ్ చేశారని పోలీసులు తెలిపారు.
ఇటుకల విషయంలో గొడవ..
రాత్రి 9 గంటల సమయంలో లైట్ ఆర్పివేసే పడుకొనే సమయంలో సదానందం కాల్పులు జరిపాడని గంగరాజు చెప్పారు. రెప్పపాటులో కాల్పుల నుంచి తప్పించుకున్నానని వివరించారు. సదానందంతో, అమ్మ గొడవ పడిందని.. ఇటుకల విషయంలో గొడవ జరిగిందని చెప్పారు. చిన్న విషయాన్ని ఇంత పెద్దగా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదన్నారు.