ఆటో నుండి దూకి పోలీస్ స్టేషన్ చేరిన యువతి, కిడ్నాప్ విఫలమై ఇలా...
సంగారెడ్డి సమీపంలోని కంది ఐఐటీకి వెళ్ళేందుకు ఓ బీటెక్ విధ్యార్థిని ఆటో ఎక్కింది.అయితే ఆటో డ్రైవర్ దారి మళ్ళించి మరో ప్రాంతానికి తీసుకెళ్ళాడు.
హత్నూర:సంగారెడ్డి సమీపంలోని కంది ఐఐటీకి వెళ్ళేందుకు ఓ బీటెక్ విధ్యార్థిని ఆటో ఎక్కింది.అయితే ఆటో డ్రైవర్ దారి మళ్ళించి మరో ప్రాంతానికి తీసుకెళ్ళాడు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు ఆటో దూకి నిందితుడి నుండి తప్పించుకొంది.
విశాఖ జిల్లాకు చెందిన స్వరూప బీటెక్ పూర్తి చేసుకొని హైద్రాబాద్ కూకట్ పల్లిలోని ఓ కోర్సులో శిక్షణ పొందుతోంది. కందిలోని ఐఐటీలో చదువుతున్న తన స్నేహితురాలని కలుసుకొనేందుకుగాను శనివారం నాడు ఆమె కూకట్ పల్లి నుండి కంది వరకు బస్సులో వెళ్ళింది. అక్కడ ఆటో ఎక్కింది.
అయితే ఆటో డ్రైవర్ రూట్ మార్చినట్టుగా ఆమె అనుమానించింది.దీంతో ఆమె తన సెల్ ఫోన్ లో రూట్ ,ను చూసుకొంది. ఆటో డ్రైవర్ దారిమళ్ళించిన విషయాన్ని ఆమె గుర్తించింది. ఈ విషయాన్ని సెల్ ఫోన్ లో స్నేహితురాలికి సమాచారమిచ్చింది.
అయితే డ్రైవర్ ఐఐటీకి తీసుకెళ్ళకుండా హత్నూర మండలం నాగులదేవుని పల్లి శివారులోకి ఆమెను తీసుకెళ్ళాడు.బాధితురాలి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
జిన్నారం సిఐ హత్నూర ఎస్ ఐ రాజేశ్ నాయక్ ను అప్రమత్తం చేశారు. స్వరూప ఆటో దిగితేచంపేస్తానని ఆటో డ్రైవర్ బెదిరించాడు. అయినా ఆమె ఆటో నుండి దూకింది. అయితే నిందితుడు ఆమె సెల్ ఫోన్ ను తీసుకొన్నాడు.
ఆమె హత్నూర పోలీసులను ఆశ్రయించింది.సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.కూకట్ పల్లి నుండి స్నేహితులు రావడంతో స్వరూపను వారి వెంట పంపారు పోలీసులు.