t pcc race:ఇప్పుడే కాదు.. సాగర్ బై పోల్ తర్వాతే.. మాణికం ఠాగూర్ క్లారిటీ
టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. చీఫ్ ఎంపికపై రోజుకో ఊహాగానాలు వెలువడుతోన్న నేపథ్యంలో.. దీనికి కాంగ్రెస్ ప్రస్తుతానికి పుల్ స్టాప్ పెట్టింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ ప్రకటించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసే వరకూ ప్రస్తుత పీసీసీ చీఫ్ కొనసాగుతారని స్పష్టం చేశారు.
పీసీసీ చీఫ్గా ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు కొనసాగనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సాగర్ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీని నియమించాలని ఇప్పటికే అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలు పంపిన సంగతి తెలిసిందే. ఈలోపే పీసీసీ విషయంలో తర్జనభర్జన, రోజుకో పేరు తెరపైకి రావడం పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఉప ఎన్నిక తర్వాతే పీసీసీని నియమించాలన్న నిర్ణయానికొచ్చింది.
దుబ్బాక ఉప ఎన్నికలో ఘోర ఓటమి చవిచూసిన హస్తం పార్టీ నాగార్జున సాగర్లోనైనా పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. సాగర్ ఉప ఎన్నికలో విజయం కోసం పార్టీ శ్రేణులన్నీ సమష్టిగా పనిచేస్తాయని ఠాగూర్ చెప్పారు. సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్కు అత్యంత కీలకమని, కాంగ్రెస్ పునరుజ్జీవానికి సాగర్ ఉప ఎన్నిక విజయం దోహదం చేస్తుందని ఠాగూర్ అభిప్రాయపడ్డారు. 162 మంది నాయకుల అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికొచ్చినట్లు ఠాగూర్ తెలిపారు.