సిటీలో ఒక్కసారిగా కుంగిన రోడ్డు: బైకిస్టులకు తీవ్రగాయాలు
హైదరాబాద్: నగరంలోని మల్కాజిగిరి పరిధిలో జరుగుతున్న మంచినీటి పైపులైను పనులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అంతేగాక తాజాగా ఇద్దరి ప్రాణంమీదకి తెచ్చాయి. శుక్రవారం రాత్రి గుత్తెదారు సఫిల్గూడ ప్రధాన కూడలిలో తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని మట్టితో పూడ్చాడు.
కాగా, శనివారం ఉదయం ఒక్కసారిగా రోడ్డు కుంగడంతో ఇద్దరు ద్విచక్రవాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, వాహనాలను బయటకు తీశారు.
పైప్లైన్ పనులు జరుగుతున్న తీరును నిరసిస్తూ మల్కాజిగిరి బిజెపి, టిడిపి నేతలు ఘటనా స్థలంలో ధర్నాకు దిగారు. కాగా, మల్కాజిగిరి ఉప కమిషనర్ రమేష్, కార్పొరేటర్ జగదీష్గౌడ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ఇది ఇలా ఉండగా, నగరంలోని రోడ్ల గుంతల కారణంగా ఇప్పటికే సుమారు 9మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా, జీహెచ్ఎంసీ అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంపై నగర ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.