"స్వరూపానందను పిచ్చాసుపత్రిలో చేర్చండి, దెయ్యమంటే ఊరుకునేది లేదు"
హైదరాబాద్ : షిర్డీ సాయిపై తన వివాదస్పద వ్యాఖ్యలకు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి నిన్న సాయంత్రం లలితా కళాతోరణంలో జరిగిన 'గురువందనమ్' కార్యక్రమంలోను సాయిబాబాపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
సాయి అసలు దేవుడే కాదని, హైందవ సిద్దాంతాలు అందుకు ఒప్పుకోవని, ఆయన్ను పూజించడమంటే దెయ్యాన్నో.. భూతాన్నో.. పూజించడమేనని ఆయన చేసిన వ్యాఖ్యలు సాయి భక్తులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్నటి గురువందనమ్ కార్యక్రమంలోను సాయి భక్తులు స్వరూపానంద స్వామికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు.
తాజాగా దిల్ సుఖ్ నగర్ లోని సాయి భక్తులంతా స్వరూపానంద స్వామి తీరును నిరసిస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళనుకు దిగారు. స్వరూపానంద పిచ్చి పట్టినవాడిలా వ్యవహరిస్తున్నాడని, ఆయన్ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపట్టారు. తమతో గనుక చర్చలకు సిద్దమైతే స్వరూపానంద నోరు మూయిస్తామని దిల్ సుఖ్ నగర్ సాయి దేవస్థాన పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాయికి పూజలు చేయడమంటే భూతాన్ని పూజించడమేనన్న స్వరూపానంద వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. స్వరూపానందకు భూతం పట్టిందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే చర్చలకు రావాలని సవాల్ విసిరారు. అనుచిత వ్యాఖ్యలతో సాయి భక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని స్వరూపానందకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.