ఇసుక మాఫియా పనే, కాదంటరేంది: సాయిలు భార్య కన్నీరు మున్నీరు
హైదరాబాద్: ఇటీవల సాయిలు ఇసుక లారీ ప్రమాదంలో మరణించాడు. ఆయన మృతి వివాదంగా మారింది. ఇసుక మాఫియా ఆయనను కావాలని హత్య చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన విఆర్ఎ అయిన సాయిలును కావాలనే పొట్టన పెట్టుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అయితే, సాయిలు విఆర్ఎ కాదని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విషయంపై వినతిపత్రం సమర్పించడానికి వెళ్లిన కాంగ్రెసు నాయకులపై గవర్నర్ నరసింహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గవర్నర్ తీరుపై కాంగ్రెసు నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ స్థితిలో సాయిలు కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చారు.
మా నాన్న విఆర్ఎ ఎందుకు కాడు...
'కట్టెబట్టుకున్నడు.. బిల్ల కట్టుకున్నడు... గట్లాంటప్పుడు మా నాయిన వీఆర్ఏ ఎందుగ్గాడు...?' అంటూ ఇటీవల మరణించిన వీఆర్ఏ సాయిలు కూతురు లావణ్య, కొడుకు విఠల్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సాయిలు భార్య కన్నీరు మున్నీరు...
'ఆ రోజు రాత్రి అన్నం అయ్యిందా అని అడిగిండు. అన్నం పెడితే తిన్నడు. డ్యూటీకి పోతున్నా అని చెప్పిండు.. గట్ల చెప్పినోడు గటే పోయిండు.. మల్లరాలే...' అని సాయిలు భార్య సాయమ్మ కన్నీరు మున్నీరైంది. ఆయనను కచ్చితంగా ఇసుక మాఫియానే చంపేసిందని ఆరోపించింది.
టీ మాస్ సమావేశం..
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారెంగావ్ గ్రామానికి చెందిన వీఆర్ఏ సాయిలు ఇటీవల మరణించాడు. ఇసుక మాఫియా కుమ్మక్కై ట్రాక్టర్తో ఢీ కొట్టించటం వల్లనే ఆయన మరణించాడని ఆరోపిస్తూ తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక (టీ మాస్ ఫోరం) ఆధ్వర్యాన సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు.
వారంతా మీడియా ముందుకు వచ్చారు
సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాభాస్కర్, టీ మాస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీ, నాయకులు శ్రీరాంనాయక్, మన్నారం నాగరాజు, వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమానికి సాయిలు భార్య సాయమ్మ, కూతురు లావణ్య, కొడుకు విఠల్తోపాటు సాయిలు తండ్రి నారాయణ, తమ్ముడు సంతోశ్ తదితరులు హాజరయ్యారు.
తగిన సాక్ష్యాలు చూపించారు..
సాయిలు వీఆర్ఏ అని చెప్పేందుకు తగిన ఆధారాలను వారు మీడియా ముందు ఉంచారు. తెలంగాణాలో ఒకే కుటుంబానికి చెందిన వారు వీఆర్ఏలుగా వంతుల వారీగా పనిచేయటం ఆనవాయితీగా వస్తున్నదని జాన్ వెస్లీ తెలిపారు. ఈ క్రమంలో సాయిలు 2017 జూన్ నుంచి వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడని చెప్పారు. స్థానిక తహశీల్దారు కూడా ఆయనకు డ్యూటీలు వేశారని గుర్తుచేశారు. అందుకనుగుణంగా రిజిస్టర్లో తహశీల్దారు సంతకాలు కూడా చేశాడని చెప్పారు.
ప్రభుత్వం వక్ర భాష్యాలు
ఇసుక మాఫియాకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వంసాయిలు మృతిపై వక్రభాష్యాలు చెబుతోందని జాన్ వెస్లీ విమర్శించారు. సాయిలు అసలు వీఆర్ఏనే కాదని మంత్రి కేటీఆర్ చెప్పటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. వాస్తవమేమిటో గుర్తించాలని అన్నారు. సాయిలు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
లేదంటే ధర్నా చేస్తాం..
తమ డిమాండ్లను అంగీకరించకపోతే పిట్లం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని జాన్ వెస్లీ హెచ్చరించారు. 16న రాష్ట్రంలోని అన్ని ఎమ్మార్వో ఆఫీసులను ముట్టడిస్తామని తెలిపారు. 22న కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ అంశంలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
మా పరిస్థితేమిటని సాయిలు భార్య
''ఆయన పోయిండు. గిప్పుడు మా పరిస్థితేంది? ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిలగాడు మాకున్నడు. మాతోపాటు మా మామ, అత్త ఉన్నరు. గా ముసలోల్ల పరిస్థితేంది? మా ఆయన్ని ఇసుక ట్రాక్టర్తోనే గుద్ది చంపిన్రు...'' అని సాయిలు భార్య విలపించింది.
తగిన ఆధారాలున్నాయి..
'మా అన్న వీఆర్ఏగా పని చేస్తున్నాడని చెప్పడానికి మా దగ్గర బలమైన ఆధారాలున్నాయి. ఆయనను డ్యూటీలోకి తీసుకున్నట్టు ఎమ్మార్వో ఆర్డర్ కాపీ ఇచ్చాడు. దాని జీరాక్స్ కూడా ఉంది. 1992లో మా నాన్న పేర ఆర్డర్ కాపీ వచ్చింది. అయితే ఆయనకు చదువురాదు కాబట్టి చదువుకున్న మమ్మల్ని డ్యూటీకి రావాలంటూ ఎమ్మార్వో చెప్పాడు. అందుకని వాటాబందీ పద్ధతిలో వీఆర్ఏలుగా నేను, మా అన్న పనిచేస్తున్నాం. మొన్నటిదాకా నేను చేశాను. నిరుడు జూన్ నుంచి మా అన్న డ్యూటీ చేస్తున్నాడు' అని సాయిలు తమ్ముడు సంతోష్ చెప్పాడు.
బాధితులను పరామర్శించిన గద్దర్
సాయిలు కుటుంబ సభ్యులను ప్రజా గాయకుడు గద్దర్ పరామర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కారంచేడు దళితులు అనుభవించిన హింసను ఇప్పుడు తెలంగాణాలో అణగారిన వర్గాలు అనుభవిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాయిలు మృతిపై సీఎం కేసీఆర్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా...
ఇసుక మాఫియా చేతిలో మృతి చెందిన సాయి లు అనే వ్యక్తి ముమ్మాటికి వీఆర్ఏనే అని తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఆధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సాయిలు వీఆర్ఏ తహసిల్దారే సంతకం పెట్టారని చెప్పారు. సోమవారం గాంధీభవన్లో మాజీ ఎమ్మెల్యే అరుణ తార ఆధ్వర్యంలో వీఆర్ఏ సాయిలు కుటుంబ సభ్యులు తల్లిదం డ్రులు శివయ్య, ఈరవ్వ, భార్య సాయవ్వతో పాటు పిల్లలు ఉత్తమ్కుమార్రెడ్డిని కలిశారు.