తెరుచు కోని వయోజన విద్యా కేంద్రాలు: మూసివేత దిశగా సాక్షరా భారత్
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాక్షరభారత్ కార్యక్రమంపై నీలినీడలు అలుముకున్నాయి.
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాక్షార భారత్ కార్యక్రమంపై నీలినీడలు అలుముకున్నాయి. అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వయోజ విద్యా శాఖ ద్వారా సాక్షర భారత్ పథకంలో వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలను కేంద్రం పక్కనపెట్టింది. దీంతో ఏడేళ్లుగా జిల్లాలో అమలవుతున్న సాక్షర భారత్ కార్యక్రమాలు సందిగ్ధంలో పడ్డాయి.
వయోజన విద్యా కేంద్రాలు గత నాలుగు రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెరుచుకోవడం లేదు. గ్రామ, మండల స్థాయిల్లో అక్షరాస్యత కార్యక్రమాల విధులను నిర్వహిస్తున్న మండల కో-ఆర్డినేటర్లు(ఎంసీవో), గ్రామ కో-ఆర్డినేటర్ల(వీసీవో) భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సాక్షర భారత్ ద్వారా అక్షరాస్యత కార్యక్రమాల అమలు కొనసాగిస్తారా లేదా అన్నది జిల్లా స్థాయిలోని ఆశాఖ అధికారులు, సిబ్బందికి అంతుపట్టని విషయంగా మారింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాక్షర భారత్ కార్యక్రమాలను 2010 సెప్టెంబరులో ప్రారంభించారు. అప్పుడు 1188 గ్రామాల్లో 2,376 వయోజన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్షరాస్యత కార్యక్రమాల అమలుకు 57 మండలాల్లో మండలానికో ఎంసీవో, వయోజన విద్యాకేంద్రానికి ఒకరి చొప్పున వీసీవోలను మొత్తం 2,376 మందిని నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 6,00,800ల మంది నిరక్షరాస్యులను ఈ కార్యక్రమం కింద జిల్లా వయోజన విద్య అధికారులు నమోదు చేశారు. ఇప్పటి వరకు వారిలోని 4,49,747 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినట్లు ఆశాఖ లెక్కలు చెబుతున్నాయి.
తాజా జనాభా లెక్కల ప్రకారం కొత్త కరీంనగర్ జిల్లాలో 1,35,721, జగిత్యాల జిల్లాలో 1,57,708, పెద్దపల్లి జిల్లాలో 1,43,652, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 84,771 మంది నిరక్షరాస్యులున్నట్లు జిల్లా వయోజన విద్య లెక్కల్లో చూపిస్తున్నారు. అయితే గత ఏడేళ్లుగా అక్షరాస్యత కార్యక్రమాలు, గ్రామాల్లోని వయోజన విద్యా కేంద్రాలు పర్యవేక్షణ, పలు కారణాలతో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదన్న అపవాదును ఎదుర్కొంటున్నాయి. గ్రామాల్లోని వయోజన విద్యా కేంద్రాల పనితీరు సక్రమంగా లేకపోయింది. అధికారుల సందర్శనలోనూ ఇలాంటి లోపాలు పలుమార్లు బయటపడ్డాయని ఆశాఖ వారే పేర్కొంటున్నారు. సాక్షర భారత్ కార్యక్రమాల ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది వారిని ఎన్ఐఓఎస్ పరీక్షకు సన్నద్ధం చేసే లక్ష్య సాధనలో జిల్లా ఆపసోపాలు పడిందన్న ఆరోపణలున్నాయి. ఎంపీ వినోద్కుమార్ దత్తత తీసుకున్న ఎల్లారెడ్డిపేట మండలంలోని వీర్నపల్లి గ్రామం సంపూర్ణ అక్షరాస్యతను సాధించి కేంద్రం నుంచి అవార్డును తీసుకరావడం గమనార్హం. గత ఏడేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లాలో సాక్షర భారత్ కార్యక్రమాలు ఒడిదొడుకుల మధ్య సాగి ప్రస్తుతం ఒక దారిలో పడటం, ఉమ్మడి జిల్లాలోని చాలా గ్రామాలు ప్రస్తుతం అక్షరాస్యతకు చేరువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సాక్షరభారత్ను నిలిపివేసే ఆలోచనకు రావడంతో ఆ శాఖ సిబ్బందిలో అందోళన కలిగిస్తోంది.
కో-ఆర్డినేటర్ల భవితవ్యం ప్రశ్నార్థకం
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాక్షరభారత్ పథకం అమలు గత మార్చి నాటికే పూర్తవుతున్నా దాన్ని గత నెల వరకు పొడిగించారు. ఈనెల 1 నుంచి ఈ కార్యక్రమం అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పథకం కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న 1022 వయోజన విద్యా కేంద్రాలు, 2091 కో-ఆర్డినేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పథకాన్ని కొనసాగించని కారణంగా ప్రస్తుతం ఆ కేంద్రాలు ఈనెల 1 నుంచి తెరుచుకోవడం లేదు. ప్రస్తుతం సాక్షరభారత్ కింద అక్షరాస్యత కార్యక్రమాల అమలు కోసం ఉన్న 2044 మంది వీసీవోలు, 47 మంది ఎంసీవోలు విధులకు దూరమయ్యారు.
కొత్త కరీంనగర్ జిల్లాలో 276 గ్రామాల్లో 552 వయోజన విద్యా కేంద్రాలు, పెద్దపల్లి జిల్లాలో 208 గ్రామాల్లో 416 కేంద్రాలు, జగిత్యాల జిల్లాలో 327 గ్రామాల్లో 654 కేంద్రాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 211 గ్రామాల్లో 422 కేంద్రాలు గత నాలుగు రోజులుగా తాళాలు తెరుచుకోవడం లేదు. మరోవైపు అక్షరాస్యత కార్యక్రమాలను చేపట్టే ఉమ్మడి జిల్లాలోని 2044 మంది వీసీవోలు, 47 మంది ఎంసీవోలు ఉపాధిని కోల్పోవాల్సి వస్తోంది.. ఇన్నాళ్లు గ్రామాల్లోని వయోజన విద్యా కేంద్రాల భవితవ్యం ఏమిటన్నది తెలియకపోగా, కో-ఆర్డినేటర్లు తమ భవితవ్యం ఏమిటన్న దానిపై ఆందోళన చెందుతున్నారు.
స్వచ్ఛంద కార్యకర్తలుగా తక్కువ వేతనాలతో ఏడేళ్లుగా అక్షరాస్యత కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అమలు చేసే సర్వేలు, ఇతరత్రా కార్యక్రమాల అమలులో ఎంసీవోలు, వీసీవోలు తమదైన సేవలను అందించారు. ప్రస్తుతం సాక్షరభారత్ పథకానికి కాలం చెల్లుతుండటంతో వారిని పక్కన పెట్టడంతో తమ కుటుంబాలు ఆర్థిక ఇక్కట్లతో ఛిన్నాబిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని కో-ఆర్డినేటర్లు పలువురు వాపోతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారా, కొత్త సంస్కరణలతో అమలు చేస్తారా అన్నదానిపై ఆశాఖలో చర్చ సాగుతోంది.