సింగరేణి ఉద్యోగులకూ తప్పని వేతనాల కోత .. కరోనా,లాక్ డౌన్ ల ఎఫెక్ట్
కరోనా వైరస్ ప్రభావం కారణంగా తెలంగాణా రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించినా సింగరేణి కార్మికులు మాత్రం విధులు నిర్వర్తిస్తున్నారు.క్లిష్ట సమయంలో రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అటంకం కలిగించరాదన్న ఉద్దేశంతోనే అన్ని సింగరేణి గనులు యధావిధిగా నడుస్తున్నాయి. ఇక లాక్ డౌన్ నిబంధనల నుండి సింగరేణి కార్మికులకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం . దీంతో తెలంగాణా రాష్ట్రంలోని అన్ని ఓపెన్ కాస్ట్ గనులు, యాంత్రిక భూగర్భ గనులను యథావిధిగా నడిపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కరోనా ప్రభావం ఉన్న సమయంలో రోజూ విధులు నిర్వర్తిస్తున్నా సింగరేణి కార్మికులకు లాక్ డౌన్ కష్టాలు తప్పని పరిస్థితి .
కరోనా నియంత్రణకు రంగంలోకి దిగిన డ్రోన్లు.... వాటితో ఏం చేస్తున్నారో తెలుసా !!
సింగరేణి ఉద్యోగులకు మార్చి నెలలో సగం వేతనం చెల్లించాలని యాజమాన్య నిర్ణయం
లాక్డౌన్ విధించడంతో వైద్యులు, మెడికల్ సిబ్బంది , పోలీసులు , మున్సిపల్ సిబ్బంది మినహాయించి ప్రతి ఒక్క ఉద్యోగికి వేతన కోత విధించింది తెలంగాణా ప్రభుత్వం . ఇక ఈ క్రమంలో సింగరేణి ఉద్యోగులకు మార్చి నెలలో సగం వేతనం చెల్లించాలని, మిగిలినది తర్వాత ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించి ఆదేశాలు జారీచేసింది. దీంతో సింగరేణి ఉద్యోగుల్లో ఒకింత అసహనం వ్యక్తం అవుతుంది. లాక్ డౌన్ సమయంలో కూడా తాము విధులు నిర్వర్తిస్తున్నామని, గృహాలకు పరిమితం కాలేదని పూర్తి జీతం ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని వారు అంటున్నారు.
15వేలను కనీస వేతనంగా ఇవ్వాలని నిర్ణయం
ఇక సింగరేణి యాజమాన్యం నిర్ణయం మేరకు సగం వేతనం చెల్లించాలి. అయితే ఇందులో కొందరికి 15వేల కంటే తక్కువ జీతం వస్తుండటంతో యాజమాన్యం కొన్ని మార్పులు చేసింది. రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు, కాంట్రాక్ట్ వర్కర్లకు మార్చి నెల జీతం 15వేలకు తక్కువ కాకుండా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే మార్చి నెల జీతంలో పండగ అడ్వాన్సు, కో-ఆపరేటివ్ సొసైటీ లోన్ రికవరీలు, క్లబ్బుల రికవరీలు వంటి కటింగులను వాయిదా వేసిన సింగరేణి యాజమాన్యం 15 వేలకు తక్కువ కాకుండా అందరికీ జీతాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో కోత పెట్టింది కనుక తాము కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నామని సింగరేణి అధికారులు చెప్తున్నారు .
Recommended Video
పదవీ విరమణ కార్మికులకు , ఉద్యోగులకు పూర్తి వేతనం
సింగరేణిలో ఎన్సీడబ్ల్యుఏ ఉద్యోగులు మొత్తం సుమారు 43 వేల మంది ఉండగా వీరిలో 27 వేల మందికి మార్చి నెలలో సగం జీతం అందుకున్నా సరే, 15 వేల రూపాయలకు పైగానే వస్తుంది. కానీ, మిగిలిన సుమారు 13,600 మందిలో 15 వేల కన్నా తక్కువ జీతం వచ్చే వాళ్ళు ఉన్నారు. వీరిని పరిగణనలోకి తీసుకున్న యాజమాన్యం కనీస వేతనం 15 వేలకు తగ్గకుండా చూడాలని నిర్ణయించింది. ఇక ఇదే సమయంలో మార్చి నెలలో పదవీవిరమణ చేసిన కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది . లాక్డౌన్ ముగిసి పరిస్థితులు చక్కబడగానే పూర్తి వేతనాన్ని చెల్లిస్తామని చెప్తున్న సింగరేణి యాజమాన్యం కార్మికులు సహకరించాలని కోరుతున్నారు.