సమత కుటుంబానికి న్యాయం జరిగింది, జిల్లాల్లో కూడా షీ టీమ్స్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే రేఖా నాయక్
సమత హత్య కేసులో ముగ్గురు దోషుల షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుంకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కోర్టు తీర్పును సమత కుటుంబసభ్యులు, గ్రామస్తులు స్వాగతించారు. వీలైనంత తర్వగా దోషులను ఉరి తీయాలని వారు కోరారు. మరోవైపు ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా కోర్టు తీర్పుపై స్పందించారు.
న్యాయం జరిగింది..
ఫాస్ట్ట్రాక్ కోర్టు తీర్పుతో సమత కుటుంబానికి న్యాయం జరిగిందని ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. తిరిగి సమతను తీసుకురాలేమని.. కానీ దోషుల శిక్షతో కొంత స్వాంతన జరుగుతుందని చెప్పారు. సమత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వారికి ఆర్థికంగా చేయూతనిస్తుందని ఎమ్మెల్యే రేఖానాయక్ స్పష్టంచేశారు. హైదరాబాద్లో మాదిరిగానే జిల్లాల్లో కూడా షీ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. సమత దోషుల తీర్పు నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్ ఫాస్ట్ట్రాక్ కోర్టు వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. కేసులో ఈ నెల 20వ తేదీన వాదనలు పూర్తయ్యాయి. 27వ తేదీన తీర్పు వెలువరించాల్సి ఉంది. కానీ న్యాయమూర్తి అనారోగ్యంగా ఉండటంతో గురువారం తీర్పును వెల్లడించారు.
ఏం జరిగిందంటే..
కుమ్రంభీం జిల్లాకు చెందిన సమత నవంబర్ 24వ తేదీన కనిపించకుండా పోయారు. బెలూన్లను విక్రయించుకొని జీవించే ఆమె.. ఎప్పటిలాగే నవంబర్ 24వ తేదీన కూడా వెళ్లారు. తిరిగివస్తోండగా ఎల్లాపటార్ గ్రామ శివారులో షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుం అనే కీచకులు వెంట పడ్డారు. సమత ఒక్కరే ఉండటంతో ఆమెను అడ్డుకొని.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సామూహికంగా లైంగికదాడి చేశారు. తర్వాత గొంతుకోసి హతమార్చారు. ఆ రోజు సాయంత్రం అవుతోన్న సమత ఇంటికి రాకపోవడంతో భర్త గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
చార్జిషీట్ దాఖలు
నవంబర్ 25వ తేదీన సమత మృతదేహం లభించింది. శరీరంపై గాయాలు కూడా కనిపించాయి. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నవంబర్ 27వ తేదీన షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుం ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు తీవ్రత దృష్ట్యా డిసెంబర్ 11వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబర్ 14వ తేదీన పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేవలం 20 రోజుల్లోనే చార్జీషీట్ ఫైల్ చేశారు.
ఉరి శిక్ష
డిసెంబర్ 23వ తేదీ నుంచి సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించారు. 44 మంది సాక్షులు అని పోలీసులు చెప్పినా.. 25 మంది మాత్రమే కోర్టులో సాక్ష్యం చెప్పారు. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు ఫాస్ట్ట్రాక్ కోర్టుకు సమర్పించారు. నిందితుల తరఫున వాదించేందుకు లాయర్లు ముందుకురాకపోవడంతో న్యాయస్థానమే రహీం అనే అడ్వకేట్ను కేటాయించింది. రెండురోజుల సమయం ఇవ్వగా ఆయన వాదనలు వినిపించారు. జనవరి 20వ తేదీన సమత కేసులో వాదనలు ముగిశాయి. ఈ నెల 27వ తేదీన తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. మేజిస్ట్రేట్ అనారోగ్యం వల్ల గురువారానికి వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురు దోషులకు ఉరి శిక్ష విధిస్తూ ఇవాళ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.