గద్దెలపైన వనదేవతలు ..నేడు మేడారంకు సీఎం కేసీఆర్.. గవర్నర్లు తమిళి సై, దత్తాత్రేయ
Recommended Video
అడవి బిడ్డల అపురూపమైన జాతర గిరిజన కుంభమేళాగా పిలవబడే మేడారం మహా జాతరలో అందరూ ఎదురు చూసిన ఘట్టం సమ్మక్క ఆగమనం ముగిసింది. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క గద్దె మీద కుంకుమ భరిణె రూపంలో కొలువుదీరింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుతీరటంతో ఊపందుకున్న జాతరలో నేడు భక్తులు అమ్మ వార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు . బంగారు తల్లులకు బంగారాన్ని నైవేద్యంగా నివేదిస్తున్నారు.
తొలిసారి మేడారం వెళ్తున్న గవర్నర్ తమిళి సై
సమ్మక్కఆగమనంతో జాతర పతాకస్థాయికి చేరుకుంది. నేడు మేడారానికి భక్తజనం పోటెత్తారు . నేడు గిరిజనుల ఇలవేల్పులైన సమక్క,సారలమ్మలను దర్శించుకోటానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ , తెలంగాణా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రానున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారంను తొలిసారిగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రత్యక్షంగా చూడనున్నారు .
నేడు మేడారంలో మొక్కులు చెల్లించుకానున్న తెలంగాణా సీఎం కేసీఆర్
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ రోజు కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మలను దర్శించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు గవర్నర్, 11.30 గంటలకు కేసీఆర్, తెలంగాణ మంత్రులు, పలువురు అధికారులు సమ్మక్క-సారక్క దేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించనున్నారు. అయితే ఇప్పటికే గవర్నర్, సీఎం మేడారం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సమాచారం.
అమ్మవార్లను దర్శించుకోనున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
అలాగే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకొని అమ్మవార్లను దర్శించుకోనున్నారు. ప్రతి మేడారం జాతరకు బండారు దత్తాత్రేయ తప్పని సరిగా అమ్మవార్లను దర్శించుకుంటారు. ఇక సీఎం , గవర్నర్ల పర్యటన నేపధ్యంలో ఆయా ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తును కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు.
జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఐదుగురు మంత్రులు
ఇక నేడు సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ మంత్రులు దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ లు మేడారం జాతర వద్ద ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. భక్తుల సౌకర్యాలను అడిగి తెలుసుకుంటున్నారు. మేడారం జాతరలో నిన్న రాత్రి సమ్మక్క గద్దె చేరుకుంది. ఆ ఘట్టాన్ని చూడటానికి, అమ్మను తీసుకువస్తున్న గిరిజన పూజారులను తాకటానికి భక్తులు తెగ ప్రయత్నం చేశారు.
పోటెత్తిన భక్త జనం .. మొక్కులు చెల్లిస్తున్న భక్తులు
జాతర సందర్భంగా మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కోట్లాది మంది ప్రజలు వనదేవతలను దర్శించుకుని తరిస్తున్నారు.ఈ రోజు భక్తులు భారీ స్థాయిలో వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు క్యూ కడుతున్నారు. బెల్లంను నిలువెత్తు బంగారంలా అమ్మలకు సమర్పిస్తున్నారు .తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా, వివిధ రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు.