అడుగు తేడా పడితే అనంతలోకాలకే..!సనత్ నగర్ ఈఎస్ఐ ముందు నరకం చూస్తున్న పాదచారులు..!!
Recommended Video
హైదరాబాద్ : అక్కడ అడుగు తేడా పడితే అనంత లోకాలకు వెళ్లాల్సిందే.. రెప్పపాటు కాలం ఏమరుపాటుగా ఉన్నా పంచప్రాణాలు గాల్లో కలిసి పోవాల్సిందే.. క్షణ కాలం అలసత్వం వహించినా వాహన చక్రాల కింద నిండు ప్రణాలు చితికి పోవాల్సిందే.. ఇదంతా ఎక్కడో మారు మూల గ్రామీణ ప్రాంతంలో జరిగుతున్న తంతు కాదు. హైదరాబాద్ నడిబొడ్డున నిత్య కృత్యంగా జరుగుతున్న ప్రాణ చెలగాటం. నగరంలో ప్రధాన రహదారైన ముంబై హైవేను ఆనుకుని అనేక వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు, హాస్పటల్స్ ఉండటం సహజం. సరిగ్గా ఇలాగే నగరంలో పేరొందిన ఆసుపత్రి ప్రధాన రహదారిని ఆనుకొని ఉంది. సుమారు 25 లక్షల మంది కార్మికులకు వైద్యం అందిస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రి ఇదే ప్రధాన హైవేను అనుకుని ఉన్న విషయం తెలిసిందే..!
ప్రాణాలు చేతిలో పెట్టుకుని రోడ్డు దాటాలి..! లేదంటే గాల్లోనే..!!
ఐతే ఇక్కడ రోడ్డు దాటి ఆసుపత్రిలోకి వచ్చే రోగులు, రోగుల బంధువులు మాత్రం నరక యాతన అనుభవిస్తున్నారు. రోడ్డు దాటుతున్నప్పుడు వేగంగా వచ్చే వాహనాలను నియంత్రించే యంత్రాంగం లేక పోవడం, ట్రాఫిక్ పోలీసులు అక్కడ విధులు నిర్వహించకపోవడం, కనీసం రోడ్డు దాటేందుకు వీలుగా జీబ్రా లైన్స్ ని ఏర్పాటు చేయడం వంటి చిన్న సౌకర్యం కూడా ఇటు ఆసుపత్రి యాజమాన్యం గాని, అటు ట్రాఫిక్ పోలీసులు గాని కల్పించక పోవడం శోచనీయం. వన్ ఇండియా ఈఎస్ఐ హాస్పటల్ ముందు రోగులు రోడ్డు దాటుతున్న వైనాన్ని చిత్రీకరిస్తున్నపుడు రోమాలు నిక్కబొడుచుకునే అనుభవాలు ఎదురయ్యాయి.
కనీస సౌకర్యాలు లేని వైనం..! రోడ్డు దాటుతున్న రోగుల పాలిట శాపం..!!
రోడ్డు దాటుతున్న క్రమంలో కనురెప్పపాటు కాలం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే అనే అంశం స్పస్టంగా తెలుస్తోంది. మెదక్, మేడ్చెల్, పఠాన్ చెరు, బీహెచ్ఈఎల్, కూకట్ పల్లి నుండి వచ్చే రోగులు లేదా రోగి బంధువులు నేరుగా హాస్పటల్ లోకి వెళ్లొచ్చు. ఆతర్వాత తిరుగు ప్రయాణం అయ్యేప్పుడు రోడ్డు దాటడంలో మాత్రం నరకాన్ని చూడాల్సి వస్తోంది. రోడ్డు దాటి మళ్లీ స్వస్ధలాలకు వెళ్లే క్రమంలో చాలా ఇబ్బందులు పడాల్సొస్తుందని తెలుస్తోంది. ఇక కోటీ, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్ పేట నుండి వచ్చే రోగులు మాత్రం రోడ్డు దాటే క్రమంలో ప్రాణాలు ఉంటాయా..? వైద్యం చేయించుకోక ముందే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయా అని భయ భ్రాంతులకు గురయ్యే పరిస్ధితులు ఈఎస్ఐ ముందు నెలకొన్నాయి.
ట్రాఫిక్ సిగ్నల్ ఉండదు.. పోలీసులు ఉండరు..! రోడ్డు దాటే వారికి మాత్రం నరకమే..!!
అటు పంజాగుట్ట నుండి అతివేగంగా వచ్చే వాహనాలను దాటుకుని, ఇటు కూకట్ పల్లి నుండి వేగంగా వచ్చే వాహనాలను నిలువరించుకుని రోడ్డు దాటుతున్నప్పుడు రోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదని తెలుస్తోంది. వేలు, వందల సంఖ్యలో వచ్చే వాహనాలను సొంతంగా చేయి ఎత్తి నిలువరింపజేసుకుని రోడ్డు దాటడం హృదయ విదారకంగా కనిపిస్తోంది. అంతే కాకుండా హాస్పటల్ ను అనుకునే సికిందరాబాద్ వెళ్లే బస్సులు ఆగడం, అక్కడే బస్ స్టాప్ ఉండడం, ఆటో వాలాలు కూడా తమ ఆటోలను అక్కడే నిలిపి ఉంచడంతో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యంగా మారింది. ఇంత జరుగుతున్నా రోగులు రోడ్డు దాటేందుకు కనీస ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం దారుణమైన పరిణామంగా తెలుస్తోంది.
పట్టించుకున్న నాథుడు లేడు..! ప్రమాదాల బారిన పడ్డా అంతే సంగతులు..!!
ట్రాపిక్ పోలీసులు మాత్రం పాదచారులు రోడ్డు దాటేందుకు మెట్రో స్టేషన్ మెట్లను ఉపయోగించుకోవచ్చు అని ఓ పోస్టర్ ను మెట్రో పిల్లార్ కు అతికించారు. అది చూసిన పాదచారులు గాని, రోగులు గాని, రోగుల బంధువులు గాని మెట్రో స్టేషన్ లోకి ఎక్కాల్సిన 70-నుండి 80 మెట్లు ఎక్కగలరా..? ఎక్కిన తర్వాత మళ్లీ అటునుండి దిగ గలరా..? అంతే కాకుండా ఎస్కలేటర్స్ ను ఉపయోగించుకోవచ్చని చెప్తున్న ట్రాఫిక్ పోలీసులు అంత పరిజ్ఞానం ఈఎస్ఐ దవాఖానాకు వచ్చే రోగులకు ఉంటుందా..? ఈ బాధలన్నీ ఎందుకని, రోడ్డు దాటడమే సులభంగా ఉందని, కాస్త రిస్కైనా రోడ్డు దాటుతున్నారు పాదచారులు. ఇలాంటప్పుడు రోడ్డు మీద సిగ్నల్ వ్యవస్థ గాని, జీబ్రా లైన్స్ గాని, ట్రాఫిక్ పోలీసుల నియామకం గాని చేపడితే పాదచారులకు కాస్త ఊరటగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదో ఓ ప్రమాదం జరిగినప్పుడే కళ్లు తెరవకుండా, ప్రమాదం జరగక ముందే ముందు జాగ్రత్తలు తీసుకుని తగు ఏర్పాట్లు చేయాలని ఈఎస్ఐ ఆసుపత్రి ముందు రోడ్డు దాటుతున్న పాదచారులు డిమాండ్ చేస్తున్నారు.