దారుణం: వీఆర్ఏను ట్రాక్టర్తో తొక్కించి చంపిన ఇసుక మాఫియా
కామారెడ్డి: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ దందాను అడ్డుకున్నందుకు వీఆర్ఏ సాయిలును దారుణంగా హత్య చేశారు. దుండగులు ట్రాక్టరుతో తొక్కించి అతనిని చంపేశారు. ఇది కలకలం రేపుతోంది.
జిల్లాలోని పిట్లం మండలం కంబాపూర్ గ్రామశివారులో కాకివాగు వద్ద నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఆర్ఏ సాయిలు అక్కడకు చేరుకున్నారు. ఇసుక తరలిస్తున్న మాఫియాను అడ్డుకున్నాడు.
ఈ క్రమంలో ఇరువురికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఇసుక మాఫియా వీఆర్ఏ సాయిలు పైనుంచి ట్రాక్టర్ను తీసుకు వెళ్లింది. అతను అక్కడికి అక్కడే మృతి చెందాడు.
కారెగాం గ్రామానికి చెందిన సాయిలు మార్తాండ గ్రామంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు సమాచారం ఇచ్చిన అనంతరం సాయిలు ఘటనాస్థలికి వెళ్లారని సమాచారం.
వీఆర్ఏ సాయిలు చనిపోయిన విషయం తెలుసుకున్న కారెగాం, మార్తాండ గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కంబాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్థానిక ఎమ్మార్వో, పోలీసులు చేరుకుని ప్రజలను శాంతింప చేసే ప్రయత్నాలు చేశారు.