మాటంటే మాటే.. కారెక్కేది లేదు.. సైకిల్ దిగేది లేదు : సండ్ర వెంకట వీరయ్య
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అధికార పక్షం చక్రాల కింద ప్రతిపక్షాలన్ని నలిగిపోతున్న పరిస్థితి. నమ్మిన బంటుగా పార్టీల కోసం పనిచేసిన నేతలు సైతం అధికార పార్టీల గాలానికి తేలిగ్గానే చిక్కుతున్నారు. దీంతో ఏ నేత ఎప్పుడు సొంత పార్టీలకు గుడ్ బై చెప్పి అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటారనేది ఆసక్తిగా మారింది. ప్రతిపక్షాలను ఖాళీ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న అధికార పార్టీలు, తమ దారిలోకి రాని నేతలను మైండ్ గేమ్ ద్వారానైనా దారిలోకి తెచ్చుకోవాలనే ఎత్తుగడలు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే.. తెలంగాణలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయిపోయిన విషయం తెలిసిందే. ఉన్న నేతలు కూడా ఇంకెంత కాలం పార్టీతో కొనసాగుతారన్నది అనుమానమే. ఇదే క్రమంలో పార్టీలో మిగిలిన నేతల్లో ఒకరైన సండ్ర వెంకట వీరయ్య కూడా గులాబీ గూటికి చేరుతారన్న ఊహగానాలు ఊపందుకున్నాయి. అయితే దీనిపై స్పందించిన సండ్ర వెంకట వీరయ్య మాత్రం ఇదంతా అధికార పక్షం మైండ్ గేమ్ అని, తన పార్టీ మార్పు వార్తలను ఖండించారు.
తన భవిష్యత్ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, టీడీపీలోనే కొనుసాగుతా గానీ పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు వీరయ్య. మాటంటే మాటే అన్న రీతిలో పార్టీ మారేది లేదని చెప్పిన ఆయన, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే టీఆర్ఎస్ ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. పాలేరు ఉపఎన్నికలో విపక్షాల ఐక్యతను చూసి టీఆర్ఎస్ భయపడుతోందని, ఆ ఐక్యతను దెబ్బ తీసేందుకే తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు.