ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది, దొంగల్లా చూస్తున్నారు: సండ్ర
హైదరాబాద్: ఎమ్మెల్యేలమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోందని, వీళ్లు పార్టీలో ఉంటారా... పోతారా అని దొంగల మాదిరిగా చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యానించారు.
గురువారం రాత్రి జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఆ విధంగా అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కేసు సమయంలో అధికార పార్టీనేతలు తనకు వర్తమానాలు పంపారని, టీఆర్ఎస్లోకి వస్తే కేసులు లేకుండా చేస్తామని చెప్పారని ఆయన అన్నారు.
అయితే తాను జైలుకు పోవడానికి కూడా సిద్ధపడి ఉండిపోయానని, ఇప్పుడు పార్టీ కార్యాలయానికి వస్తుంటే తనను, అరికెపూడి గాంధీ, ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరిపోతున్నామని కొన్ని టీవీ చానళ్లలో వేశారని, గడ్డి తినే పని నేను చేయనని అన్నారు.
పోయే దరిద్రం ఒకేసారి పోతే మంచిదని, ఇక ముందు పోయేవాళ్లకు కూడా కలిపి దీనిని సంతాపసభ మాదిరిగా నిర్వహిద్దామని శేరిలింగంపల్ల శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ అన్నారు. కొన్ని మీడియా చానళ్లు టీఆర్ఎస్ పార్టీకి బానిసల మాదిరిగా పనిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
తాను పార్టీ మారుతున్నానని ఈ ఇరవై నెలల్లో కనీసం పదిసార్లు వార్తలు వేశారని, ఈ పార్టీలోనే పుట్టానని, ఇక్కడే చస్తానని, పార్టీ మారేది మాత్రం లేదని స్పష్టంచేశారు. పాల వ్యాపారం నుంచి తనను పార్లమెంటుకు చంద్రబాబు పంపారని, మల్లన్న ఎప్పటికీ టీడీపీలోనే ఉంటాడని పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి అన్నారు.