ఆ విషయంలో సీఎం కేసీఆర్ దగ్గర తలవంచుతా అన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు గులాబీ బాస్ కేసీఆర్ మీద నిప్పులు చెరిగిన, చిందులు తొక్కిన జగ్గారెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత నుండి రూటు మార్చారు. ఆయన కాంగ్రెస్ ను వీడి టీఆర్ ఎస్ లో చేరతారన్న ప్రచారం సైతం జోరుగానే సాగింది. అయితే ఆ సమయంలో కూడా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తాను పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించకుండా దాన్ని కాలమే నిర్ణయిస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో చాలా రోజుల పాటు ఆయనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇక తాజాగా నియోజకవర్గం కోసం సీఎం కేసీఆర్ ముందు తలవంచుతా అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
14 ఏళ్లుగా హరీశ్ రావుతో మాటల్లేవు.. ప్రజా సంక్షేమం కోసం తప్పలేదు : జగ్గారెడ్డి
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దగ్గర తల వంచుతా అని ఆయన పేర్కొనటం కాంగ్రెస్ శ్రేణులకు సైతం ఏ మాత్రం రుచించటం లేదు . నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల కోసం సీఎం కేసీఆర్ దగ్గర తల వంచుతానని పేర్కొన్నారు . సంగారెడ్డిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నియోజకవర్గ అభివృద్ది కోసం ,తనను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం సీఎంకు వ్యతిరేకంగా తాను ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వనని, అలాగే, ఎవ్వరూ ఇవ్వొద్దని ఆయన తన సూచనగా తెలిపారు . అలాగే, బీజేపీకి కూడా వ్యతిరేకంగా ప్రకటనలు చేయొద్దని సూచించారు. సంగారెడ్డి అభివృద్ధే తమకు ముఖ్యమని, తాను ఏది చేసినా నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల కోసమేనని స్పష్టం చేశారు జగ్గారెడ్డి .ఏది ఏమైనా ఈ తరహా వ్యాఖ్యలతో దుమారం రేపటం మాత్రం ఒక్క జగ్గ రెడ్డి కే చెల్లు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.