సొంత ఊరికి మేలు చేయండి.. కలెక్టర్ పిలుపుతో భారీగా విరాళాలు
సంగారెడ్డి : సొంత గ్రామానికి మేలు చేయండి.. ఎంతో కొంత సాయం చేయండంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇచ్చిన పిలుపుతో దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. జన్మభూమి రుణం కొంత తీర్చగా చాలా మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. మన ఊరు పేరిట మొదలెట్టిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుండటం విశేషం. కలెక్టర్ పిలుపుతో స్పందిస్తున్న వ్యాపార, వాణిజ్య సంస్థల అధినేతలతో పాటు లీడర్లు, అధికారులు కూడా తాము సైతం అంటూ చేయూతను అందిస్తున్నారు.
మన ఊరు కార్యక్రమం.. కలెక్టర్ పిలుపు.. గ్రామాలకు విరాళాలు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వర్కింగ్ స్టైల్ ఔరా అనిపిస్తుంది. ఇప్పటికే భూవాణి, పల్లె నిద్ర, మెగా శ్రమదానం లాంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి జిల్లా వాసుల మనసులకు దగ్గరైన కలెక్టర్ మరోసారి గ్రామాల అభివృద్ధికి సరికొత్తగా వ్యూహ రచన చేశారు. మన ఊరు పేరుతో ప్రారంభించిన కొత్త కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుండటం విశేషం. ఆయా గ్రామాలకు చెందిన వారు తమ ఊరికి ఎంతో కొంత సాయం చేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.
అధికారం కోసం సెక్స్ రాకెట్.. మధ్యప్రదేశ్ స్కాండల్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
అనూహ్య స్పందన.. భారీగా విరాళాలు
సొంత గ్రామానికి మేలు చేయండి.. ఎంతో కొంత సాయం చేయండంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తలపెట్టిన మన ఊరు కార్యక్రమానికి విరాళాలు అందించడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే 3 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరినట్లు తెలుస్తోంది. జీవితంలో స్థిరపడ్డ వారు గానీ.. ఆర్థికంగా ఏ ఢోకా లేని వారు తమ ఊరి అభివృద్ధి కోసం ఎంతో కొంత సాయం చేయండన్న కలెక్టర్ పిలుపుతో పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి.
సొంత ఊరికి కొంత మేలు
సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే ఆయా గ్రామాలకు చెందిన వారు ఆర్థికంగా ఎదిగిన వారు, విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించినవారు చాలామందే ఉన్నారు. ఈ క్రమంలో సొంత ఊరికి ఎంతో కొంత సాయం చేయండంటూ కలెక్టర్ ఇచ్చిన పిలుపుతో చాలామంది పాజిటివ్గా స్పందిస్తున్నారు. అయితే ప్రభుత్వం తలపెట్టిన 30 రోజుల పల్లెల కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా కలెక్టర్ మన ఊరు కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. ఆ క్రమంలో నేతలు, అధికారులు, వ్యాపారులు, ఉద్యోగులు తమకు తోచినంత సాయం చేస్తున్నారు.
రెండు విడతల్లో విరాళాల సేకరణ
సంగారెడ్డి జిల్లాలో సోమవారం (30.09.2019) నాడు మొదటి విడతగా.. అక్టోబర్ 5వ తేదీన రెండో విడతగా మన ఊరు విరాళా కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగా తొలుత సోమవారం నాడు తొలి దశ కింద మరిన్ని విరాళాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఎంతమంది దాతలు విరాళాలు ఇస్తారో వారందరినీ గ్రామస్తుల సమక్షంలో సన్మానించాలని తీర్మానించారు. గ్రామాభివృద్దిలో భాగస్వాములు కావడానికి ఇది మంచి అవకాశమని.. ఎక్కడ నివసిస్తున్నా సరే గ్రామాభివృద్ది కోసం ఎంతో కొంత సాయం చేయాలని కోరుతున్నారు కలెక్టర్ హనుమంతరావు.
తెలంగాణపై టీడీపీ కన్నేసిందా.. కేసీఆర్కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు రెడీయా?
ఆ విరాళాలు ఇలా ఖర్చు
మన ఊరు పేరుతో గ్రామాల అభివృద్ధి కోసం వసూలు చేస్తున్న ఈ విరాళాలను ఆయా గ్రామాల్లో తొలుత అత్యవసర పనులకు వినియోగించనున్నారు. వరుస క్రమంలో సమస్యలను గుర్తించి వాటి కోసం ఖర్చు చేయనున్నారు. ప్రధానంగా స్కూళ్లల్లో మౌలిక వసతులు, గ్రామాల్లో పరిశుభ్రతకు చెత్త బుట్టల పంపిణీ, స్ట్రీట్ లైట్లు, హరిత హారం తదితర కార్యక్రమాలకు పెద్ద పీట వేయనున్నారు. అయితే ఈ వినూత్న కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు అభినందించి ప్రోత్సహిస్తుండటం విశేషం.