రేవంత్పై జగ్గారెడ్డి మహోగ్ర దాడి : తమాషాలు బంద్ చెయ్యాలని వార్నింగ్..
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ అనుచరులు ఫేస్బుక్లో పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో కూర్చుని ప్రజా సమస్యలపై మాట్లాడాలా లేక రేవంత్ అనుచరులు ఫేస్బుక్లో పెట్టే పోస్టులను చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఇకనైనా ఈ తమాషా బంద్ చేయకపోతే.. ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీకి చెబుతానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఏమైనా తీస్మార్ఖానా.. నిన్న గాక మొన్న వచ్చి సీఎం అంటాడా అని ప్రశ్నించారు.
పులులు,సింహాలు 2వేల మెజారిటీతో గెలుస్తాయా..
కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఒక్కరికీ సీఎం కావాలని ఉంటుందని.. కానీ అంతిమ నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్దేనని జగ్గారెడ్డి అన్నారు. అనుచరులు ప్రతీ ఒక్కరికి ఉన్నారని.. ఒక్క రేవంత్ రెడ్డికే లేరన్న సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పార్టీని ఎలా పైకి తీసుకురావాలో తమకు బాగా తెలుసన్నారు. సంగారెడ్డిలో గీతారెడ్డి,దామోదర రాజనరసింహ,నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్,జానారెడ్డి.. వీళ్లు లేకుండానే పార్టీ ఇన్నేళ్లుగా అక్కడ పనిచేస్తోందా అని ప్రశ్నించారు. వీళ్లందరినీ రేవంత్ రెడ్డే గెలిపించాడా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నిజంగా పులి,సింహమే అయితే.. సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో ఎందకు ఓడిపోయాడని ప్రశ్నించారు. పులులు,సింహాలు 2వేల మెజారిటీతో గెలుస్తాయా అని ప్రశ్నించారు.
వ్యక్తిగత కేసులను పార్టీకి రుద్దవద్దని వార్నింగ్
రేవంత్ రెడ్డి,ఆయన అనుచరులు చేసే న్యూసెన్స్ను ఇకనైనా అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు జగ్గారెడ్డి. పార్టీకి కోర్ కమిటీ,పీసీసీ వ్యవస్థ ఉన్నాయని.. ఏదైనా అందులో చర్చించి కార్యక్రమాలను నిర్ణయిస్తారని అన్నారు. అంతే తప్ప సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లడమేంటని ప్రశ్నించారు. బలహీనుడిని బలవంతుడు కొట్టడం సహజమని.. అధికారంలో ఉన్న పార్టీ కేసులు పెట్టడంలో ఆశ్చర్యం లేదని అన్నారు. అయితే ఆ కేసులను పార్టీకి రుద్దడమేంటని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యే పదవిలో లేనప్పుడు ప్రభుత్వం తనపై కూడా కేసులు పెట్టిందని.. అయినా వాటిని ఎదుర్కొన్నానే తప్ప పార్టీకి రుద్దలేదన్నారు. తెలియక పాస్పోర్ట్ కేసులో సంతకాలు పెట్టి ఇరుక్కున్నానని.. తప్పు తప్పే కాబట్టి కేసులను ఎదుర్కొంటున్నానని చెప్పారు.
చిటికిస్తే పరిగెత్తుకొస్తారు..
రేవంత్పై ప్రభుత్వం కేసులు పెడితే.. వ్యక్తిగత కేసులను పార్టీకి రుద్దాల్సిన అవసరం లేదన్నారు.అంత భయం ఉన్నవాడు తప్పు చేయకుండా ఉండాలన్నారు. ఒకానొక సందర్భంలో వీర శివాజీ లాంటివాడే ఔరంగజేబుకు తలవంచి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడని.. టైమ్ మనది కానప్పుడు సహనంతో ఉండటం నేర్చుకోవాలని హితవులు పలికారు. రేవంత్,ఆయన అనుచరులు పార్టీని డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అసలు పార్టీలో ఒక్కడే పనిచేస్తున్నాడన్న ప్రచారాన్ని సోషల్ మీడియాలో బంద్ చేయాలని హెచ్చరించారు. అనుచరులు ప్రతీ ఒక్కరికీ ఉన్నారని గుర్తుచేశారు. తాను చిటికేస్తే సంగారెడ్డి నుంచి 10వేల మంది నడుచుకుంటూ వస్తారని.. కోమటిరెడ్డి బ్రదర్స్ చిటికేస్తే నల్గొండ నుంచి లక్ష మంది వస్తారని అన్నారు. ఎవరికి లేరు అనుచరులు.. శ్రీధర్ బాబుకు లేరా.. జానారెడ్డికి లేరా అంటూ మండిపడ్డారు.
తమాషాలు బంద్ చెయ్యాలి..
జగ్గారెడ్డికి అప్పులు ఉన్నాయన్న మాట నిజమేనని.. కానీ కోర్టుల్లో పిటిషన్లు వేసి వసూళ్లకు పాల్పడే బుద్ది లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిపై ఈ స్థాయిలో తాను ఎప్పుడూ ఫైర్ అవలేదని.. కానీ రేవంత్,ఆయన అనుచరుల వ్యవహారంతో మొదటిసారి తీవ్రంగా నొచ్చుకున్నానని అన్నారు. తాను ఎవరికైనా తల వంచుతాను అంటే.. అది తన నియోజకవర్గ ప్రజలకే తప్ప మరొకరికి కాదన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి,రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డిలు ఉన్నప్పుడు.. నీకు సమైక్యాంధ్ర స్టాండ్ ఎందుకని వాళ్లు చెప్పినా వినలేదన్నారు. అది తన అభిప్రాయం కాబట్టి దానికే కట్టుబడి ఉన్నానని అన్నారు. రేవంత్ అనుచరులు ఇకనైనా తమాషాలు పక్కనపెట్టాలని.. శ్రీధర్ బాబు కారు ఎక్కబోతున్నారు లాంటి ప్రచారాన్ని ఆపాలని హెచ్చరించారు.